బెంగళూరు, ఏప్రిల్ 21: కర్ణాటకలోని మండ్య నుంచి లోక్సభ బరిలో నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామికి ఈ ఎన్నిక అగ్ని పరీక్షగా మారింది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒక్క ఉప ఎన్నికలో తప్ప 13 సార్లు విజయం సాధించిన చరిత్ర కాంగ్రెస్ది. మాజీ ముఖ్యమంత్రిగా, జేడీ(ఎస్) నుంచి పటిష్టమైన వ్యక్తిగా కుమారస్వామి రంగంలో ఉండటంతో మండ్య లోక్సభ స్థానం అందరినీ ఆకర్షిస్తున్నది. రాజకీయంగా ఎంతో అనుభవమున్న ఆయన ఈసారి కాంగ్రెస్కు చెందిన కోటీశ్వరుడైన సివిల్ కాంట్రాక్టర్ వెంకటరమణి గౌడ అలియాస్ స్టార్ చంద్రుతో పోటీ పడుతున్నారు. ఎంతో కాలంగా ఈ ప్రాంత ప్రజలతో అనుబంధం ఉన్న కుమారస్వామికి 254 కోట్ల రూపాయల ఆస్తిపరుడైన వెంకటరమణిని ఎలా ఢీకొంటారన్నది ఆసక్తికరంగా మారింది. తాను రాజకీయాలకు కొత్త అయినప్పటికీ తాను మండ్య పుత్రుడినంటూ వెంకట రమణి ప్రచారం చేస్తున్నారు.
ఈ నెల 26న ఎన్నికలు జరిగే మండ్య నియోజకవర్గం ప్రజలకు వ్యవసాయం ప్రధాన వృత్తి. పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒకసారి జరిగిన ఉప ఎన్నికలో ఎస్ఎం కృష్ణ ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి ఎన్నికవ్వడం తప్ప 13 సార్లు ఇక్కడ కాంగ్రెస్ నెగ్గుతూ వచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో మండ్య నుంచి నటి సుమలత అంబరీష్, బీజేపీ మద్దతుతో ఇండిపెండెంట్గా నెగ్గారు. తర్వాత ఆమె బీజేపీలో చేరినప్పటికీ, ఈ సారి ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉండటం, జేడీ(ఎస్)తో బీజేపీ పొత్తులో ఉండటంతో ఇక్కడ కుమారస్వామి, గౌడ మధ్య ముఖాముఖీ పోటీ ఏర్పడింది.
8 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మండ్యలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరింటిని గెల్చుకుంది. 18 లక్షల మంది ఓటర్లున్న మండ్యలో 50 శాతం మంది ఒక్కలిగ సామాజిక వర్గం వారే ఉన్నారు. దీంతో వారు ఎవరివైపు మొగ్గుచూపుతారే ఆ పార్టీ వారే ఇక్కడ విజయం సాధిస్తారు. కాగా, దళితులు, ఓబీసీలు, మైనారిటీ వర్గాలకు కాంగ్రెస్ చేస్తున్న బలమైన వాగ్గానాల వల్ల వారు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారేమోనని ఎన్డీఏ ఆందోళన చెందుతున్నది. ఇదే జరిగితే జేడీ(ఎస్), బీజేపీ కూటమికి నష్టం జరగడం ఖాయం. 90 శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న ఈ ప్రాంత ప్రజలకు ప్రధాన నీటి వనరు కావేరీ నదే. కాబట్టి కావేరీ జలాల వివాదం కూడా ఈ ఎన్నికపై ప్రభావం చూపుతుంది. ఒక్కలిగలలో తన హోదాను పునరుద్ధరించాలనుకుంటున్న జేడీ(ఎస్) ఈ ఎన్నికలు అతి ముఖ్యమైనవిగా భావిస్తున్నది. దీంతో ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని కుమారస్వామి పట్టుదలగా ఉన్నారు.