Kesavananda Bharati case | న్యూఢిల్లీ: రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని 1973లో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన చరిత్రాత్మక తీర్పు ప్రస్తుతం తెలుగుసహా 10 భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్నది. ‘కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’గా ప్రసిద్ధి చెందిన ఈ కేసులో రాజ్యాంగ సవరణ విషయంలో పార్లమెంటుకు ఉన్న అధికారాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడి 50 ఏండ్లు పూర్తయింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. ఈ తీర్పు కోసం సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఓ పేజీని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం ఈ తీర్పు హిందీ, తెలుగు, తమిళం, ఒడియా, మలయాళం, గుజరాతీ, కన్నడ, బెంగాలీ, అస్సామీస్, మరాఠీ భాషలలో అందుబాటులో ఉందన్నారు. హిందీని ఉపయోగించే జిల్లా కోర్టులు, న్యాయవాదులు ఇకపై సుప్రీంకోర్టు తీర్పులను హిందీలోనే ప్రస్తావించవచ్చునని తెలిపారు. షెడ్యూల్డు భారతీయ భాషలన్నింటిలోకి తీర్పులను అనువదిస్తున్నట్లు చెప్పారు.
రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు గల అధికారాన్ని పరిమితం చేస్తూ రాజ్యాంగ ధర్మాసనం 1973లో కేశవానంద భారతి కేసులో తీర్పు చెప్పింది. రాజ్యాంగ సవరణలు చేసే అధికారం పార్లమెంట్కు ఉంది కానీ, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మార్చే అధికారం లేదని ప్రకటించింది. ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థ స్వతంత్రత, అధికారాల విభజన, లౌకికవాదం వంటివి మౌలిక స్వరూపంలో భాగమని, వాటిని సవరించేందుకు వీలులేదని స్పష్టంచేసింది.