న్యూఢిల్లీ, జూన్ 6: థర్డ్వేవ్ ప్రత్యేకంగా చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ప్రముఖ ఎపిడమాలజిస్టు డాక్టర్ చంద్రకాంత్ లహరియా అన్నారు. ఏ వేవ్లో అయినా పెద్దవారితో పోల్చితే 0-18 ఏండ్ల మధ్య వయసున్న వారిలో కొవిడ్ తీవ్రత పెరిగే ప్రమాదం తక్కువని చెప్పారు. ఇప్పటివరకు ప్రపంచంలోని వివిధ దేశాల్లో వివిధ సందర్భాల్లో వచ్చిన కరోనా థర్డ్ వేవ్ ప్రత్యేకంగా పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపినట్టు ఆధారాలు లేవన్నారు. థర్డ్ వేవ్ గురించి కొన్ని వార్తా ఛానళ్లలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిరాధారమని కొట్టిపారేశారు. వైరస్ జన్యుక్రమాన్ని మార్చుకొంటున్నదని, ఇప్పటికే పిల్లలపై ప్రభావం చూపుతున్నదని, మహారాష్ట్రలో ఏప్రిల్-మే నెలల్లోనే లక్ష మంది పిల్లలకు కరోనా వైరస్ సోకడమే ఇందుకు తార్కాణమని వస్తున్న కథనాలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మొత్తం కేసుల్లో పిల్లల సంఖ్య చూడాలి తప్ప కేవలం పిల్లల సంఖ్య చెప్పి భయపెట్టడం తగదన్నారు.
మొత్తం కేసుల్లో పిల్లల వాటా 2-5%
కరోనా సోకి దవాఖానలో చేరినవారిపై ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి మొత్తం కొవిడ్ రోగుల్లో పిల్లల వాటా 2-5 శాతం ఉన్నట్లు లహరియా చెప్పారు. వైరస్ క్రమంగా తన జన్యుక్రమాన్ని మార్చుకొన్నా కూడా అది వేగంగా వ్యాపిస్తుంది తప్ప ప్రత్యేకంగా ఒక వయసు వారిని లక్ష్యంగా చేసుకోని విస్తరించడం జరగదని తెలిపారు. ‘మహారాష్ట్రలో ఏప్రిల్-మే నెలల్లో 99వేల మంది పిల్లలకు కరోనా సోకింది. అదే సమయంలో అక్కడ 29 లక్షల కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. అంటే మొత్తం కేసుల్లో పిల్లల వాటా 3.5శాతం. పిల్లలపై కరోనా ప్రభావం తక్కువేనని సెరో సర్వేల్లో కూడా తేలింది’ అని ఆయన పేర్కొన్నారు. పిల్లల్లో కూడా ఏవైనా వ్యాధులు ఉంటేనే కొవిడ్ తీవ్రం అవుతుందని చెప్పారు.