కేంద్రం, రాష్ర్టాలకు సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, మే 3: దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో మహమ్మారి కట్టడికి లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. ప్రజల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాలన్నది. ఒకవేళ లాక్డౌన్ విధించాలన్న నిర్ణయానికి వస్తే, అంతకు ముందే తగిన ఏర్పాట్లు చేయాలని, పేదలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్లు డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వరరావు, ఎస్ రవీంద్రభట్తో కూడిన ధర్మాసనం వెల్లడించింది. కరోనా కట్టడి చర్యల అంశాన్ని సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం దానిపై విచారణ జరిపింది. ఆ వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఉంచింది. దీని ప్రకారం.. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో మహమ్మారి మళ్లీ విజృంభిస్తే తీసుకోబోయే చర్యలపై నివేదికను సమర్పించాలని కేంద్రం, రాష్ర్టాలను కోర్టు ఆదేశించింది.
టీకా ధరలపై పునరాలోచించాలి
కేంద్రం వ్యాక్సిన్ పాలసీపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. టీకాలు కేంద్రానికి ఒక ధర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరో ధర ఉండటాన్ని తప్పు బట్టింది. 18+ వయసు వారికి టీకా ధరల విషయంలో కేంద్రం పునరాలోచించాలని ఆదేశించింది.