చెన్నై, ఆగస్టు 18: పేదలకు సంక్షేమ పథకాల పేరుతో ఉచితంగా సేవలు చేయటం దేశానికి మంచిది కాదన్న ప్రధాని మోదీకి తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ దిమ్మదిరిగే ప్రశ్నలు సంధించారు. ఉచిత సేవలు ఇవ్వరాదని ఏ హక్కుతో అడుగుతున్నారని గురువారం నిలదీశారు. కేంద్రం కోసం రాష్ర్టాలు తమ విధానాలను ఎందుకు మార్చుకోవాలని సూటిగా ప్రశ్నించారు.
మీకేమైనా ప్రత్యేక హక్కులున్నాయా?
దేశం మొత్తం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టే చేయాలని నిర్దేశించజాలదని త్యాగరాజన్ స్పష్టంచేశారు. కేంద్రానికి నచ్చినట్టే చేయాలని అడగటానికి మోదీ సర్కారుకు స్వర్గం నుంచి తెచ్చుకొన్న ప్రత్యేక రాజ్యాంగ హక్కులేమైనా ఉన్నాయా? అని నిలదీశారు. ‘ ఉచిత పథకాలు వద్దని రాజ్యాంగంలో ఉన్నదా? లేదే! నువ్వేమైనా ఆర్థికవేత్తవా? కాదే! ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ సాధించావా? లేదే! మాకన్నా గొప్ప పనితనం చూపించావా? లేదే! దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేశావా? లేదే! ప్రజల తలసరి ఆదాయం పెంచావా? లేదే! మరి ఏ ప్రాతిపదికన మీ కోసం మా విధానాలను మార్చుకోవాలి? ఇదేమైనా స్వర్గం నుంచి మీకు లభించిన అదనపు రాజ్యాంగ హక్కా?’ అని త్యాగరాజన్ ప్రశ్నించారు.
కోర్టు కేసులతో కట్టడిచేసే యత్నం?
దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాలతోపాటు పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రతిపక్షాలు ప్రజలకు ఆకర్షణీయమైన హామీలు ఇవ్వకుండా కట్టడి చేసేందుకు బీజేపీ ద్విముఖ వ్యూహంతో పనిచేస్తున్నది. ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలంతా నిత్యం సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ ప్రచారం చేస్తుండగా, ఆ పార్టీ నేతలు కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేసి విపక్షాలను కట్టడి చేసేలా చట్టబద్ధమైన ఆదేశాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా కఠిన ఆదేశాలివ్వాలంటూ బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కొనసాగుతున్నది.