కోల్కతా: పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్షా లోక్సభలో ప్రకటన చేయాలంటూ ఆందోళనకు దిగిన 33 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జి ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ సస్పెండ్ చేయడం మంచి పద్ధతి కాదని ఆమె వ్యాఖ్యానించారు.
సభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రభుత్వానికి భయమెందుకని మమతా బెనర్జి ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎంపీలందరినీ సస్పెండ్ చేసుకుంటూ పోతే వాళ్లు సభలో తమ గళాన్ని ఎలా వినిపిస్తారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ఉంటుందని, కానీ ప్రభుత్వం ప్రతిపక్షాలను బయటికి పంపి మూడు బిల్లులు పాస్ చేసుకున్నదని విమర్శించారు.
ప్రశ్నించిన ఎంపీలందరినీ బయటికి తోలితే ప్రజల గొంతుకను వినిపించేది ఎవరని బెంగాల్ సీఎం ఫైరయ్యారు. ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. విపక్ష సభ్యులకు బదులుగా వాళ్లు (ప్రభుత్వం) సభనే రద్దు చేస్తే సరిపోతుందని ఆమె ఎద్దేవా చేశారు. విపక్షసభ్యులందరినీ బహిష్కరించి సభ నడిపే నైతిక హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. వాళ్లు నడిపేది పార్లమెంట్ను కాదని, పరిహాసాన్ని అని మండిపడ్డారు.