బెంగళూరు: కేంద్రంతోపాటు కర్ణాటకలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రభుత్వాలపై.. సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న మల్లిఖార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. దేశంలో నిరుద్యోగం పెచ్చుమీరుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలవల్ల దేశంలో నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశన్నంటున్నాయని మండిపడ్డారు.
దేశ స్థూల జాతీయోత్పత్తి రేటు దారుణంగా పడిపోయిందని, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారి పోతున్నదని ఖర్గే విమర్శించారు. బీజేపీ-ఆరెస్సెస్ కలిసి దేశాన్ని మత ప్రాతిపదికన విడగొడుతున్నాయని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, మైనారిటీల నడుమ చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. బీజేపీ-ఆరెస్సెస్ నాయకులు ప్రతిదీ ఎన్నికల కోణంలోనే చూస్తున్నారని దుయ్యబట్టారు.
స్వతంత్ర దర్యాప్తు సంస్థలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని మోదీ సర్కారు పూర్తిగా తన అధికార దుర్వినియోగం కోసం వాడుకుంటున్నదని మల్లిఖార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ నూటికి నూరుపాళ్లు విజయం సాధించి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. అందుకోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు బాగా కష్టపడి పనిచేస్తున్నారని కితాబిచ్చారు.
బీజేపీ-ఆరెస్సెస్ కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం తన బాధ్యత అని ఖర్గే చెప్పారు. కుట్రలమారి బీజేపీని గద్దె దించడం కోసం ఢిల్లీలోని పార్లమెంట్ నుంచి గ్రామాల్లోని వీధుల వరకు తమ పోరాటం సాగుతుందని ఆయన పేర్కొన్నారు.