సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్నా కొద్దీ.. ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శల జోరు పెరుగుతున్నది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ హిమాచల్లో తన ప్రచార జోరు పెంచారు.
అక్కడ అధికారంలో భారతీయ జనతాపార్టీపైన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మండి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ప్రచార సభలో ప్రియాంకాగాంధీ ప్రసంగించారు. మండి జిల్లా ప్రజల కోసం హిమాచల్ ముఖ్యమంత్రి ఏం చేశాడని స్థానిక ఓటర్లను ప్రశ్నించారు. జిల్లాలో 63 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా బీజేపీ వాటిని భర్తీ చేయలేదని ఆరోపించారు.
ఉద్యోగ ఖాళీలు ఉన్నా బీజేపీ ఎందుకు భర్తి చేయడం లేదని ప్రియాంక ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేకనే బీజేపీ సర్కారు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం లేదని విమర్శించారు. ప్రస్తుతం హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్పారు. ద్రవ్యోల్బణం అదుపులో లేక నిత్యావసరాల ధరలు, అత్యావసరాల ధరలు మండిపడుతున్నాయన్నారు.