న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ పాలనలో న్యాయశాస్త్ర నియమాలను తుంగలో తొక్కారని, ప్రజాస్వామ్యం కూనీ అవుతున్నదని ఆయన మండిపడ్డారు. అదానీ అంశంపై విపక్షాల ఆందోళనలతో ఉభయసభలు మధ్యాహ్నానికి వాయిదా పడిన అనంతరం ఖర్గే పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు.
మోదీ ప్రభుత్వం దేశాన్ని నియంతృత్వ ధోరణితో నడిపిస్తున్నదని, పైగా ప్రభుత్వ పెద్దలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటారని ఖర్గే ఎద్దేవా చేశారు. గౌతమ్ అదానీ స్టాక్స్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ కోసం తాము డిమాండ్ చేస్తున్నామని, అయితే తాము ఆ అంశాన్ని లేవనెత్తినప్పుడల్లా మైకులు కట్ చేస్తున్నారని, దాంతో గందరగోళం నెలకొనడం సభను వాయిదా వేయడం జరుగుతున్నదని ఆయన ఆరోపించారు.