న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ విధించే యోచన లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్, ఇతర అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల, నియంత్రణ చర్యలపై వారితో చర్చించారు. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, గత 24 గంటల్లో 3,583 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు.
ఢిల్లీలో నాలుగోసారి కరోనా విజృంభిస్తున్నదని కేజ్రీవాల్ అన్నారు. అయితే ఎలాంటి భయాందోళన అవసరం లేదని, నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కరోనా టీకాలపై దృష్టిసారించామని, గురువారం 71 వేల మందికి వ్యాక్సిన్ వేసినట్లు వివరించారు.