శ్రీనగర్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది. తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన యాత్ర.. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు వివిధ రాష్ట్రాలను చుడుతూ చివరకు జమ్ముకశ్మీర్కు చేరుకుంది. కశ్మీర్లోనే రాహుల్గాంధీ తన యాత్రను ముగించనున్నారు.
ఈ క్రమంలో ఇవాళ జమ్ములోని సత్వార్ పట్టణానికి రాహుల్ భారత్ జోడో యాత్ర చేరింది. ఈ సందర్భంగా కశ్మీర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్గాంధీ.. జమ్ముకశ్మీర్లో రాష్ట్ర హోదా పునరుద్ధరణకు మించిన సమస్యే లేదని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్లో రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ తన సర్వశక్తులను ఒడ్డుతుందని అన్నారు.
అంతకుముందు రాహుల్గాంధీ జమ్ము నగరంలోని శ్రీ రఘునాథ్జీ ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం తన భారత్ జోడో యాత్రను కొనసాగించారు.