విపక్ష పాలిత ప్రభుత్వాలకు రాజ్భవన్ అడ్డంకులు
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్లను అడ్డుపెట్టుకొని కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తున్నదనే వాదనలు ఉన్నాయి. వీటిని బలపర్చేలా ఆయా రాష్ర్టాల గవర్నర్ల వ్యవహారశైలి ఉంది. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి పంపిస్తే గవర్నర్లు మాత్రం ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఇలా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న అన్ని రాష్ర్టాల్లోనూ బిల్లులకు గవర్నర్లు మోకాలడ్డుతున్నారు. ఫలితంగా సజావుగా సాగాల్సిన ప్రభుత్వ వ్యవహారాలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి.
-నేషనల్ డెస్క్
తెలంగాణలో బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేస్తున్న ఆలస్యానికి విసిగిపోయిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. పది బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. వీటిల్లో కొన్ని బిల్లులు గత ఏడాది సెప్టెంబర్ నుంచి గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. బిల్లులను ఆమోదించని గవర్నర్ వాటిని తిప్పి పంపించే పని కూడా చేయట్లేదు. దీంతో గవర్నర్ వైఖరి వివాదాస్పదమవుతున్నది.
తమిళనాడు ప్రభుత్వం చేస్తున్న బిల్లులకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించడం లేదని సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ రమ్మీని నిషేధిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవంగా చేసిన బిల్లును గవర్నర్ ఆమోదించకుండా వెనక్కి పంపించడం వివాదమైంది.నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని చేసిన బిల్లును కూడా గవర్నర్ ఆమోదించలేదు.
జార్ఖండ్ గవర్నర్గా దాదాపు 20 నెలలుగా ఉన్న రమేశ్ బైస్ 10 బిల్లులను ఆమోదించకుండా తిప్పి పంపించారు. మూక దాడుల నియంత్రణ బిల్లును 2021 డిసెంబరులో పంపించగా ఇప్పటివరకు ఆమోదం తెలపలేదు. జార్ఖండ్ ఫైనాన్స్ బిల్ – 2022ను మూడుసార్లు పంపించినా గవర్నర్ ఆమోదించలేదు.