న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను త్వరలోనే భర్తీచేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. జడ్జీల నియామకానికి అర్హుల పేర్లను సూచించాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను (సీజే) ఆదేశించారు. సుప్రీంకోర్టులో శుక్రవారం 39వ హైకోర్టు న్యాయమూర్తుల సదస్సును జస్టిస్ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఏడాది వ్యవధిలోనే హైకోర్టుల్లో 126 న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేశామని, త్వరలో మరో 50 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకొంటున్నట్టు వెల్లడించారు. సుప్రీంకోర్టులో 9 మంది కొత్త న్యాయమూర్తులతోపాటు హైకోర్టులకు 10 మంది ప్రధాన న్యాయమూర్తులను నియమించినట్టు తెలిపారు. ఆరేండ్ల తర్వాత ఈ సదస్సు నిర్వహించారు. కాగా, శనివారం ఇక్కడి విజ్ఞాన్ భవన్లో ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సదస్సు జరుగనుంది. ప్రధాని నరేంద్రమోదీ ఈ సదస్సును ప్రారంభిస్తారు.
వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలో హెల్త్కేర్ సర్వీసులు: సుప్రీం
వినియోగదారుల పరిరక్షణ చట్టం-2019 నుంచి వైద్యులు, ఆరోగ్య పరిరక్షణ(హెల్త్కేర్) సేవలకు మినహాయింపు ఉండదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టంచేసింది. ఈ మేరకు గత ఏడాది బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును కోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మెడికోస్ లీగల్ యాక్షన్ గ్రూప్ అనే ఎన్జీవో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 1986 చట్టంలో పేర్కొన్న సేవల నిర్వచనంలో హెల్త్కేర్ను ప్రస్తావించలేదని, కొత్త చట్టంలో కూడా చేర్చాలన్న ప్రతిపాదన చేశారే తప్ప, చేర్చలేదని పిటిషన్దారు తరఫు న్యాయవాది వాదించారు. దీనిని కోర్టు తిరస్కరించింది. వైద్య సేవలను మినహాయించాలనుకుంటే ప్రభుత్వం చట్టంలో ప్రత్యేకంగా పేర్కొనేదని కోర్టు తెలిపింది.