Cholera | న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా రానున్న రోజుల్లో సుమారు 100 కోట్ల మంది కలరా బారినపడే ఆస్కారం ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. 40 దేశాలకు చెందిన చిన్నారులు ఈ జాబితాలో ఉన్నట్టు తాజా నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కలరా పునరాగమనం భయంకరంగా ఉండబోతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) తెలిపింది. ఇప్పటికే 24 దేశాల్లో కేసులు నమోదైనట్టు ఆ సంస్థకు చెందిన గ్లోబల్ కలరా రెస్పాన్స్ మేనేజర్ హెన్రీ గ్రే వెల్లడించారు. వాతావరణ మార్పులు, పరిసరాల శుభ్రత, పారిశుద్ధ్యం, నీటి శుద్ధిపై ఎక్కువ పెట్టుబడులు లేకపోవడం తదితర కారణాల వల్ల కలరా విజృంభిస్తున్నదని వివరించారు.
అంతర్యుద్ధాల కారణంగా కొన్ని దేశాల్లో కలరా కేసులు పెరుగుతున్నాయని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1.8 కోట్ల కలరా టీకాల డోసులు కావాలని డిమాండ్ ఉండగా, 0.8 కోట్ల డోసులే అందుబాటులో ఉన్నాయని హెన్రీ గ్రే తెలిపారు. టీకాల ఉత్పత్తి పెంచడం ఈ సమస్యకు పరిష్కారం కాదని పేర్కొన్నారు. నీటి శుద్ధిపై ప్రపంచ దేశాలు దృష్టి సారించడమే కలరా సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుందని ఆయన సూచించారు. కలరా నిర్మూలనకు డబ్ల్యూహెచ్వో 160 మిలియన్ డాలర్లతో ప్రణాళికలు రచించినట్టు పేర్కొన్నారు.