Census | న్యూఢిల్లీ, మే 28: రెండేండ్లుగా వివిధ కారణాలతో నిలిచిపోయిన జనాభా లెక్కల సేకరణ(సెన్సస్) లోక్సభ ఎన్నికల ముందు జరిగే అవకాశముందని ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే జనాభా లెక్కల సేకరణ ఆధారంగా సేకరించిన వివరాలతో సబ్సిడీలకు, సంక్షేమ పథకాలకు కోత పెడతారని పెద్దఎత్తున ప్రచారం సాగుతున్నది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కనుక బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే సామాన్యుడి బతుకు దుర్భరమేనని, ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు, సబ్సిడీలకు స్వస్తి పలికిన మోదీ ప్రభుత్వం తాజాగా నిర్వహించనున్న సెన్సస్ డాటా ఆధారంగా ఉన్న కొద్దిపాటి పథకాలకు కూడా మంగళం పాడి తమ బతుకులను దుర్భరం చేస్తుందన్న భయం సామాన్యుల్లో నెలకొన్నది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం జూన్ 30 నుంచి మూడు నెలల తర్వాత అనగా సెప్టెంబర్ 30 నుంచి జనాభా లెక్కల సేకరణ చేపట్టాల్సి ఉన్నది.
వచ్చే ఏడాది ఏప్రిల్, మే మధ్యలో జరిగే లోక్సభ ఎన్నికల కన్నా ముందే జనాభా లెక్కల సేకరణ పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ సేకరణ తొలి డిజిటల్ సెన్సస్గా నిలవనుంది. పౌరులు తమ వివరాలను సొంతంగా ఆన్లైన్లో నమోదు చేసే అవకాశం ఉండొచ్చు. స్మార్ట్ ఫోన్ మొదలుకొని నివసిస్తున్న ఇంటి గోడలకు వాడిన మెటీరియల్ వరకు ప్రతి పౌరుడిని 31 ప్రశ్నలను అడగనున్నారు. అయితే వీటికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాల్సిన అవసరం ఉన్నది.