రాయ్పూర్/ఐజ్వాల్, నవంబర్ 6: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఛత్తీస్గఢ్లో తొలి విడతలో20 స్థానాలకు, మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతగా మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఛత్తీస్గఢ్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉండగా.. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో అధికార ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్, జెడ్పీఎం మధ్య త్రిముఖ పోరు నెలకొన్నది.
ఛత్తీస్గఢ్ మొదటి విడతలోని 12 నియోజకవర్గాలు నక్సల్స్ ప్రభావిత బస్తర్ రీజియన్లో ఉన్నాయి. ఎన్నికలు సజావుగా జరిగేందుకు 60 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. తొలి దశలో దాదాపు 40 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోన్నారు. సుక్మా, బీజాపూర్, దంతెవాడ, కంకేర్, నారాయణ్పూర్ జిల్లాలకు 156 ఎన్నికల సిబ్బంది బృందాలను హెలికాప్టర్ల ద్వారా తరలించామని తెలిపారు. 5,304 పోలింగ్ కేంద్రాలకుగానూ 2,431 కేంద్రాలోల వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నది. మాజీ సీఎం, బీజేపీ నేత రమణ్ సింగ్ పోటీచేస్తున్న రంజన్గావ్ నియోజకవర్గం తొలి దశ ఎన్నికల జాబితాలో ఉన్నది.
మిజోరంలో 40 స్థానాలకు ఒకేసారి..
మిజోరంలోని 40 స్థానాలకు 174 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మంగళవారం జరిగే ఎన్నికల్లో 8.57 లక్షల మందికి పైగా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,276 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మధూప్ వ్యాస్ వెల్లడించారు. వీటిలో 30 పోలింగ్ కేంద్రాలు అంతఃరాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులో ఉన్నాయని, వాటిని సమస్యాత్మకంగా గుర్తించినట్టు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.