ఢిల్లీ, మార్చి 20 (నమస్తే తెలంగాణ): బిల్లుల ఆమోదంలో ఆలస్యంపై, గవర్నర్ తీరుపై స్పందన తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్లో పెట్టుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. ఒక దశలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధపడినా..సొలిసిటర్ జనరల్ విజ్ఞప్తి చేయటంతో నోటీసుల జారీని నిలుపుదల చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పది బిల్లులను దీర్ఘకాలంగా గవర్నర్ తన వద్ద పెండింగ్ లో పెట్టుకోవటంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సుప్రీంకోర్టులో ఈ నెల 2న స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది.
ఈ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహం, జస్టిస్ జేబీ పార్థివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ గవర్నర్ కార్యదర్శికి నోటీసులు ఇవ్వాలని కోరారు. పాలనా వ్యవహారాల్లో గవర్నర్కు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండకూడదని, ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా గవర్నర్ వ్యవహరించాలని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సుప్రీం కోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయాన్ని కోరింది. దీనిపై స్పందించిన తుషార్ కేంద్రానికి నోటీసులు జారీ చేయవద్దని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన 10 బిల్లుల్లో కొన్ని కొద్ది నెలల క్రితమే గవర్నర్కు చేరాయని తుషార్ ఒప్పుకున్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న సీజేఐ, గవర్నర్ కార్యదర్శికి నోటీసులు ఇవ్వటం లేదని, కేంద్ర ప్రభుత్వానికి జారీ చేస్తామని చెప్పారు.
కేంద్రానికి కూడా నోటీసులు అవసరం లేదని తుషార్ చెప్పారు. గవర్నర్ బిల్లులను ఆమోదించకపోవటంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కాపీని అందజేయాలని కోరారు. ఇది రాజ్యాంగ విధులు నిర్వహించే గవర్నర్ తీరుపై కేసు అని గుర్తు చేశారు. దుష్యంత్ దవే స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం తరపున తుషార్ మెహతా హాజరుకావటంపై తమకు ఏవిధమైన అభ్యంతరం లేదన్నారు. వాదనల తర్వాత సుప్రీంకోర్టు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేయకుండా గవర్నర్ బిల్లులను పెండింగ్లో పెట్టుకున్న వ్యవహారంలో కేంద్రప్రభుత్వ స్పందన తెలియజేయాలని ఆదేశించింది.