న్యూఢిల్లీ/చండీగఢ్, ఫిబ్రవరి 20: చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. మేయర్గా రిటర్నింగ్ అధికారి ప్రకటించిన బీజేపీ అభ్యర్థి మనోజ్ సోన్కర్ ఎన్నిక చెల్లుబాటు కాదని పేర్కొన్న న్యాయస్థానం.. కోర్టులోనే ఓట్ల కౌంటింగ్ నిర్వహించి ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమార్ను విజేతగా ప్రకటించింది. గత కౌంటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారి చెల్లుబాటు కావని ప్రకటించిన ఎనిమిది ఓట్లను పరిగణనలోకి తీసుకొన్న న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. గత నెల 30న జరిగిన మేయర్ ఎన్నికల ప్రక్రియలో పలు తీవ్రమైన తప్పిదాలు జరిగినట్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గుర్తించింది. అందుకు బాధ్యుడైన రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్పై విచారణకు ఆదేశించింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేయడం లేదని కోర్టు పేర్కొన్నది.
ఆప్ అభ్యర్థికి అనుకూలంగా పడిన ఎనిమిది ఓట్లను చెల్లుబాటు కావంటూ చేసిన ప్రకటనలో జరిగిన తప్పు వరకు మాత్రమే పరిమితం అవుతున్నామని పేర్కొన్నది. చండీగఢ్ మేయర్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు, కౌంటింగ్ ప్రక్రియ వీడియోను సీజేఐ ధర్మాసనం పరిశీలించింది. రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ ఎనిమిది బ్యాలెట్ పత్రాలను ఉద్దేశపూర్వకంగానే తారుమారు చేశారనే విషయం స్పష్టమవుతున్నదని పేర్కొన్నది. గత నెలాఖరులో నిర్వహించిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో తగినంత సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ అభ్యర్థి అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. రిటర్నింగ్ అధికారి అనిల్ ఎనిమిది మంది ఆప్ కౌన్సిలర్ల బ్యాలెట్ పత్రాలను ట్యాంపరింగ్ చేసి, బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారని పేర్కొంటూ ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చండీగఢ్లోని ఆప్ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకొన్నారు. పార్టీ నేతలు, కౌన్సిలర్లు మిఠాయిలు పంచుకొన్నారు. ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ తీర్పుపై స్పందిస్తూ ఇది ప్రజాస్వామ్యం, చండీగఢ్ ప్రజల విజయమని అన్నారు. ఆప్ అధికార ప్రతినిధి సౌరబ్ భరద్వాజ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మేయర్ ఎన్నికల్లో అనైతికతకు పాల్పడిన బీజేపీ నేతలు దేశానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు తీర్పుపై ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కష్ట సమయాల్లో సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని అన్నారు. ‘నిజం ఆఖరుకు గెలిచింది’ అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంతోషం వ్యక్తం చేశారు. మేయర్ ఎన్నికల్లో బీజేపీ చేసిన ఘోర తప్పిదానికి తగిన సమాధానం వచ్చిందని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని కాంగ్రెస్ అభిప్రాయపడింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల ప్రక్రియలో సంస్థాగత విధ్వంసం జరిగిందని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు మంచుకొండ అంత మోదీ-షా కుట్రలో ఇది ఒక చిన్న ముక్క మాత్రమేనని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని భారతీయులందరూ ఉమ్మడిగా ఎదుర్కోవాలన్నారు.
చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంపై తీర్పు ద్వారా సుప్రీంకోర్టు సరికొత్త చరి త్ర సృష్టించింది. న్యాయమూర్తులు కోర్టు రూమ్ను కౌంటింగ్ కేంద్రంగా మార్చి బ్యాలెట్ పత్రాలను లెక్కించారు. తర్వా త ఆప్ అభ్యర్థి మేయర్గా విజయం సాధించినట్టు ప్రకటించారు. కుయుక్తుల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియ నిర్వీర్యం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టుపై ఉన్నదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. తాజాగా మరోసారి మేయర్ ఎన్నిక నిర్వహించాలన్న బీజేపీ అభ్యర్థనను సీజేఐ ధర్మాసనం ఈ సందర్భంగా తిరస్కరించింది.