న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఉత్తరప్రదేశ్లోని శ్రీకృష్ణజన్మభూమి స్థల వివాదానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. దీంతో షాహీ ఈద్గా మసీదుపై శాస్త్రీయ సర్వే చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ‘ప్రార్థనా స్థలాల చట్టం-1991’ను అమలుజేయాలని, హైకోర్టు ఆదేశాల్ని నిలిపివేయాలంటూ షాహీ ఈద్గా మసీదు కమిటీ తరఫున దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
మథురలోని వందల ఏండ్ల క్రితం నాటి హిందూ ఆలయాన్ని కూల్చివేసి షాహీ ఈద్గా మసీదును నిర్మించారని, దానిని తిరిగి హిందువులకు అప్పగించాలని భగవాన్ శ్రీకృష్ణ విరాజ్మాన్, మరో ఏడుగురు వ్యక్తులు స్థానిక కోర్టును ఆశ్రయించారు. దీనిపై వివిధ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లన్నీ హైకోర్టుకు బదిలీ అయ్యాయి. అది మొదట్లో హిందూ ఆలయం అవునో, కాదో తేల్చేందుకు శాస్త్రీయ సర్వే నిర్వహించాలని గత ఏడాది డిసెంబర్లో స్థానిక కోర్టు తీర్పు ఇవ్వగా, దీనిని సమర్థిస్తూ అలహాబాద్ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. ఇందుకోసం అడ్వొకేట్ కమిషనర్ను నియమిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొన్నది. న్యాయవాదుల కమిషన్కు సంబంధించి విధివిధానాల్ని డిసెంబర్ 18న వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది.