Supreme Court : కేసుల విచారణ అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత మూడు నెలల్లోగా తుది తీర్పు వెల్లడించాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. తీర్పు ఆలస్యం కావడం వల్ల పిటిషన్దారులకు తీవ్ర నష్టం జరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని హైకోర్టులు విచారణ అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత మూడు నెలల్లోగా తీర్పు వెల్లడించాలని ఆదేశించింది.
రిజర్వ్ చేసిన తేదీ నుంచి తుది తీర్పు కోసం గరిష్టంగా మూడు నెలలు మాత్రమే సమయం తీసుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జోయ్మాల్యా ఆధ్వర్యంలోని బెంచ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. హైకోర్టులు బెయిల్ దరఖాస్తుకు సంబంధించిన కేసుల్లో విచారణ అనంతరం తీర్పును అదే రోజు వెల్లడించాలి. ఒకవేళ తీర్పు రిజర్వ్ చేస్తే మరుసటి రోజే తీర్పు ఇవ్వాలి. అలాగే, బెయిల్పై తీర్పు వెలువడిన వెంటనే ఈ ఆదేశాల్ని జైలు అధికారులకు త్వరగా అందేలా చూడాలి. బెయిల్, రిలీజ్ ఆదేశాలు పొందిన వారు వీలైతే అదేరోజు విడుదలయ్యేలా చూడాలి. ఒకవేళ ఆలస్యమైతే కనీసం మరుసటి రోజైనా విడులయ్యేలా చూడాలి. కింది కోర్టులు కూడా ఈ ఆదేశాల్ని పాటించాలి.
అదే రోజు తీర్పు వెల్లడించి, సమాచారాన్ని జైలు అధికారులకు తెలియజేయాలి. అండర్ట్రయల్ ఖైదీలు అదే రోజు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి విడుదలవ్వాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో మూడు నెలలకు ముందే తీర్పు వెల్లడించాలి. హైకోర్టుల్లో తీర్పు కోసం, న్యాయం కోసం వేలాది మంది పిటిషనర్లు ఎదురుచూస్తుంటారు. వారికి త్వరగా న్యాయం అందించడం కనీస కర్తవ్యం అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.