న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: శాశ్వత కమిషన్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. మహిళా కోస్టు గార్డ్ అధికారులకు పర్మినెంట్ కమిషన్ మంజూరు చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసింది. మహిళలకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేసిన కోర్టు.. ‘మీరు చేయలేకుంటే.. మేం చేస్తాం’ అని పేర్కొన్నది. ఈ విషయాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాదికి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. షార్ట్ సర్వీస్ కమిషన్ కింద కోస్టు గార్డు(తీర ప్రాంత రక్షణ) ఉద్యోగాల్లో నియమితులైన అర్హులైన మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేయాలని కోరుతూ ఓ మహిళా అధికారి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
ఈ సందర్భంగా న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేయాలని కోస్టు గార్డ్ విభాగాన్ని కోరుతామని కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకట రమణి ధర్మాసనానికి తెలిపారు. నేవీ, ఆర్మీకి కోస్టు గార్డ్ విభాగం భిన్నంగా ఉంటుందని ఏజీ వాదించారు. పిటిషన్పై తదుపరి విచారణను న్యాయస్థానం మార్చి 1వ తేదీకి వాయిదా వేసింది. మహిళా అధికారి పిటిషన్పై ఈనెల 19న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోస్టు గార్డ్ విషయంలో ఎందుకు తేడా చూపిస్తున్నారని ప్రశ్నించింది. ‘కోస్టు గార్డ్ విభాగంలో మహిళలు ఎందుకు ఉండకూడదని మీరు అనుకొంటున్నారు? సరిహద్దులను కాపాడగలిగే మహిళలు.. సముద్ర తీర ప్రాంతాలను కూడా రక్షించగలరు! మీరు పదేపదే చెప్పే నారీశక్తిని.. చేతల్లో చూపించండి’ అంటూ కేంద్రాన్ని దుయ్యబట్టింది. పితృస్వామ్య మనస్తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించింది.