Kapil Sibal | ఢిల్లీ, మార్చి 22: మద్యం పాలసీ కేసులో ఈడీ అరెస్టు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. బెయిల్ కోసం కవిత దరఖాస్తు చేసి ఉంటే.. దానిపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. తన అరెస్టును రద్దు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈడీకి నోటీసులు జారీచేసింది. బెయిల్ కోసం కవితను ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించడంపై ఆమె తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘న్యాయస్థానాలు తమ వారసత్వాన్ని గుర్తుంచుకోవడం అవసరం. చరిత్రకారులు ఈ కోర్టు చరిత్రను రాసినప్పుడు.. నేటి ఈ కేసును మాత్రం స్వర్ణాక్షరాలతో లిఖించరు’ అని వ్యాఖ్యానించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘సరే.. చూద్దాం..’ అంటూ ప్రతివ్యాఖ్య చేసింది.
మద్యం విధానం కేసులో ఈడీ సోదాల పేరుతో వచ్చి అక్రమంగా అరెస్ట్ చేసిందని, సీబీఐ స్పెషల్ కోర్టు తనను కస్టడీకి ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని పేరొంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 537 పేజీల పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ఎంఎం సుందరేశ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కవిత తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో కవిత నిందితురాలు కాదని సాక్షాత్తు సుప్రీంకోర్టుకు చెప్పిన ఈడీ ఆమెను ఎలా అరెస్టు చేస్తుందని ప్రశ్నించారు. నిరుడు సెప్టెంబర్లో నిందితురాలు కాదని, సాక్షిగా మాత్రమే విచారిస్తున్నామని చెప్పిన ఈడీ అంతకుముందు ఆగస్టు నెలలో అప్రూవర్లు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కవితపై కీలక ఆధారాలు ఉన్నాయంటూ అరెస్టు రిపోర్టులో ఎలా పేరొంటుందని ప్రశ్నించారు.
ఆగస్టులోనే నిందితురాలని తెలిస్తే.. సెప్టెంబర్లో నిందితురాలు కాదని చెప్పడంలో ఔచిత్యం ఏమిటని పేర్కొన్నారు. ఈడీ సుప్రీంకోర్టుకు ఇచ్చిన మాటకు కట్టుబడి లేదని అన్నారు. ఒకటంటే ఒక సాక్ష్యం సంపాదించలేకపోయినా, ఎలాంటి ఆధారాలు లేకపోయినా కవితను అరెస్టు చేసిందని తప్పుపట్టారు. మద్యం కేసులో పిటిషనర్ కవిత నిందితురాలిగా లేరని, ఆ కేసును సిట్కు బదిలీ చేయాలని కోరే హకు ఆమెకు లేదని ఈడీ సుప్రీంకోర్టుకు చెప్పిందని గుర్తుచేశారు. కేవలం అప్రూవర్ల వాంగ్మూలాలను పట్టుకుని ఈడీ చీకట్లో బాణం వేస్తున్నదని, కవితను అన్యాయంగా అరెస్టు చేసిందని చెప్పారు.
కవితకు వ్యతిరేకంగా ఉన్న అన్ని స్టేట్మెంట్స్ను ఈడీ అప్రూవర్ల నుంచే తీసుకుందని సిబల్ చెప్పారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి వాంగ్మూలం ఆధారంగా కవితను నిందితురాలిగా పేరొంటున్నట్టు ఈడీ చెప్తున్నదని, కానీ ఆయనతోపాటు మరొకరి వాంగ్మూలాలను 2023 ఆగస్టులోనే తీసుకుందని గుర్తుచేశారు. అలాంటప్పుడు సెప్టెంబర్ 24న జరిగిన విచారణలో కవిత నిందితురాలు కాదని ఎలా చెప్తుందని ప్రశ్నించారు. ట్రయల్ కోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ ట్రయల్ కోర్టుకు వెళితే ఏం జరిగిందో తెలిసిందేనని వ్యాఖ్యానించారు.
ఈ సమయంలో సిబల్ తిరిగి వాదిస్తూ, ఇదే సుప్రీంకోర్టులో గత ఏడాది సెప్టెంబర్ 24న ఈడీ సమర్పించిన వివరాలను పరిశీలించాలని కోరారు. “పిటిషనర్ కవిత నిందితురాలిగా లేరు. మద్యం కేసును సిట్కు బదిలీ చేయాలని కోరే హకు పిటిషనర్కు లేదు.’ అని ఈడీ స్వయంగా ఆ తేదీన సుప్రీంకోర్టుకు చెప్పిందని వివరించారు. ఇప్పుడు ఈడీ పిటిషనర్ను ఎలా అరెస్ట్ చేస్తుందని ప్రశ్నించారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి గత ఏడాది జూలై 14న ఇచ్చిన ప్రకటన, గోపీ కుమారం అనే వ్యక్తి అదే ఏడాది ఆగస్ట్ 8న ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఈడీ చర్యలు ఉన్నాయని వివరించబోతుండగా సుప్రీంకోర్టు అడ్డుకుంది. ఈడీ దేశ అత్యున్నత న్యాయస్థానంలో చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తున్నదని సిబల్ చెప్పారు. పిటిషనర్ కవిత నిందితురాలు కాదని అప్పుడు చెప్పిన ఈడీ ఆ తర్వాత ఏ ప్రాతిపదికపై పిటిషనర్ను అరెస్టు చేస్తుందని ప్రశ్నించగానే.. సుప్రీంకోర్టు కల్పించుకుని, కేసు మెరిట్స్లోకి వెళ్లవద్దని, రాజ్యాంగపరమైన అంశాలపై తాము జూలైలో విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.
కేసులోని కీలక విషయాలు వినలేమంటే ఏం చేయాలి అని సిబల్ ప్రశ్నించారు. ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద ఎలా అరెస్టు చేస్తుందని, కేసులో నిందితురాలు కాదని సాక్షాత్తు సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత అరెస్టు చేయడంలో ఔచిత్యం ఏమిటని మరోసారి అడిగారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన మాటకు భిన్నంగా చేస్తుంటే.. తాము ఇకడ కాకుండా ఎకడ చెప్పుకోవాలని ప్రశ్నించారు. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు మళ్లీ బదులిచ్చింది. ఈ దశలో కవిత తరఫు మరో సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి కల్పించుకొంటూ.. ఏదో చెప్పబోతుండగా.. సుప్రీంకోర్టు గతంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదని గుర్తుచేసింది. కవిత పిటిషన్ను ఏ కారణం చెప్పకుండానే ఉపసంహరించుకున్నారని చెప్పింది. ఈడీ అరెస్టు నేపథ్యంలో సమగ్ర వివరాలతో తాజా పిటిషన్ దాఖలు చేసిన కారణంగా గత పిటిషన్ను విత్డ్రా చేసుకున్నట్టు చౌదరి వివరించారు. ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని చెప్పిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు సత్వర విచారణ జరిపేలా ఆదేశాలివ్వాలని చౌదరి కోరగా అందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.
ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఆదేశించడంపై కపిల్ సిబల్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అన్ని కేసుల విషయంలో ఒకే తీరుగా వ్యవహరించాలని కోరారు. కొందరు రాజకీయ నేతలు, ఆర్థిక స్థోమత ఉన్న వారు నేరుగా సుప్రీంకోర్టుకు వస్తే రాజ్యాంగంలోని 32వ అధికరణం కింద విచారణ చేయలేమని ధార్మసనం స్పష్టం చేసింది. ఆరు వారాల్లోగా తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఈడీ ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్పై మరో రెండు వారాల్లో రిప్లయ్ కౌంటర్ దాఖలు పిటిషనర్ను చేయాలంది. తదుపరి విచారణను జూలై నెలకు వాయిదా వేసింది.
విచారణ ప్రారంభం కాగానే కపిల్సిబల్ లేచి.. ‘దిల్లీ మద్యం కేసులో మా వాదనలు వినండి. దయచేసి హైకోర్టుకు వెళ్లండని మళ్లీ చెప్పవద్దు. ఇదే మా అభ్యర్థన. మాకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చినా ఏం పర్వాలేదు. ఇదే కోర్టులో చెప్పిన దానికి విరుద్ధంగా ఈడీ చర్యలున్నాయి. ఏం జరిగిందో వినండి. పిటిషనర్కు (కవిత) వ్యతిరేకంగా ఒకటంటే ఒక ఆధారం లేదు. ఈడీ ఒక సాక్ష్యాన్ని కూడా చూపలేదు. ప్రతిదీ అప్రూవర్ ప్రకటనపైనే ఆధారపడి కేసు దర్యాప్తు చేస్తున్నది. చిన్నపాటి సాక్ష్యాధారం కూడా లేదు. అప్రూవర్ ప్రకటనలనే ఈడీ ప్రామాణికంగా చేసుకుంటున్నది. పిటిషనర్ను చట్ట వ్యతిరేకంగా అన్యాయంగా అరెస్టు చేసింది’ అని వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. పిటిషన్లో రాజ్యాంగపరమైన అంశాలను ప్రస్తావించారని, ఇదే తరహాలో విజయ్ మదన్లాల్ దాఖలు చేసిన ప్రధాన కేసుతో పిటిషన్ను జత చేసి జూలైలో విచారణ చేస్తామని చెప్పింది.