మొక్కల పెంపకంతో గ్రామానికి కొత్త కళ
క్రమం తప్పకుండా పారిశుధ్య చర్యలు
100శాతం మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం పూర్తి
అందుబాటులోకి వైకుంఠధామం, డంపింగ్యార్డు
ఏన్కూరు, మే 23: గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘పల్లె ప్రగతి’ని అమలు చేస్తున్నది. వైకుంఠ ధామం, కంపోస్ట్ షెడ్, డంపింగ్యార్డ్, పల్లె ప్రగతి వనాల ఏర్పాటుకు నిధులు విడుదల చేయడంతో పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయి. కొత్తశోభను సంతరించుకుంటున్నాయి. ఈ కోవలోనే ఏన్కూరు మండలంలోని తిమ్మారావుపేట తన రూపురేఖలు మార్చుకున్నది. పాలకవర్గం అందరి సహకారంతో ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దింది. 1,985 జనాభా ఉన్న ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధిపై ప్రత్యేక కథనం.
జరిగిన ప్రగతి ఇదీ..
గ్రామంలో రూ.25 లక్షలతో రైతువేదిక, రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ.4 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.2.50 లక్షలతో కంపోస్ట్షెడ్, రూ. 29 లక్షలతో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద సీసీ రోడ్లు, రూ.7 లక్షల పంచాయతీ నిధులతో సీసీ రోడ్లు, రూ.6 లక్షలతో కల్వర్టుల నిర్మాణాలు పూర్తయ్యాయి. రూ.3 లక్షలతో ఎల్ఈడీ బల్బులు సమకూరాయి. రూ.2 కోట్లతో 40 డబుల్ ఇండ్ల నిర్మాణం జరుగుతుంది. వైకుంఠధామానికి ఫెన్సింగ్ అవసరం అవడంతో దాతలు రూ.2 లక్షలు అందజేశారు. ఈ నిధులతో ఫెన్సింగ్ ఏర్పాటైంది. మరో రూ.80 వేల నిధులతో కూర్చునేందుకు బల్లాలతో పాటు ఇతర వసతులు సమకూరాయి.
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ..
గ్రామంలో 100శాతం ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం పూర్తయింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందుతున్నది. పాలకవర్గం పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. కార్మికులు ప్రతిరోజూ చెత్తాచెదారాన్ని సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. నీటి గుంటల్ని ఎప్పటికప్పుడు పూడ్చుతున్నారు. క్రమం తప్పకుండా వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. వారంలో రెండుసార్లు ఫాగింగ్ చేస్తున్నారు. దీంతో గ్రామం పరిశుభ్రంగా దర్శనమిస్తున్నది. గ్రామంలో సీజనల్ వ్యాధులు దూరమయ్యాయి. గ్రామంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు, పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పంచాయతీ వారు ట్యాంకర్ సాయంతో ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పెడుతున్నారు. సిబ్బంది ఎప్పటికప్పుడు పాదులు పెడుతూ వాటిని సంరక్షిస్తున్నారు.
ఆదర్శ పంచాయతీ..
తిమ్మారావుపేట పాలకవర్గం ప్రగతి పనులను సకాలంలో పూర్తి చేసి ఇతర పంచాయతీలకూ ఆదర్శంగా నిలిచింది. పల్లె ప్రకృతి వనం, రైతువేదిక, వైకుంఠధామ నిర్మాణంతో గ్రామానికి కొత్త కళ వచ్చింది. పంచాయతీలో పారిశుధ్య నిర్వహణ బాగుంది. ఇతర అభివృద్ధి పనులూ చకచకా సాగుతున్నాయి.
-అశోక్, ఎంపీడీవో, ఏన్కూరు
అందరి సహకారంతో..
ప్రభుత్వ ప్రోత్సాహం, వైరా ఎమ్మెల్యే రాములునాయక్ సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. గతంలో గ్రామం కళావిహీనంగా ఉండేది. ఇప్పుడు పచ్చని చెట్లతో కళకళలాడుతున్నది. పంచాయతీకి సమకూరిన ట్రాక్టర్తో పారిశుధ్య నిర్వహణ సులభతరమైంది. మున్ముందు గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం.
-సర్పంచ్ ఆరెం సుహాసిని