Lok Sabha Elections | న్యూఢిల్లీ, మే 5: సార్వత్రిక ఎన్నికల మూడో దశకు రంగం సిద్ధమైంది. మే 7న 92 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రచారపర్వం ముగిసింది. దేశ రాజకీయాల్లో కీలక నేతలుగా ముద్రపడ్డ వారికి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. కొన్ని స్థానాల్లో ఫలితాలు సదరు నేతల భవిష్యత్తును తారుమారు చేసే పరిస్థితి ఉన్నది. దీంతో తమ కంచుకోటల్లో గెలుపు కోసం నేతలు మండుటెండల్లో చెమటోడ్చి ప్రచారం నిర్వహించారు.
కర్ణాటకలో మూడో దశలో 14 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. వీటిల్లో గుల్బర్గా, ధార్వాడ్, హవేరీ కీలక స్థానాలు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సొంత నియోజకవర్గం గుల్బర్గా. ఈసారి ఖర్గే పోటీ నుంచి తప్పుకొని, తన అల్లుడు రాధాకృష్ణ దొడ్డమానికి టికెట్ ఇచ్చారు. గుల్బర్గాలో విజయం కోసం ఖర్గే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భావోద్వేగ ప్రసంగాలు చేశారు. ఇక, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి నాలుగోసారి ధార్వాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. జోషిపై ఈసారి కాంగ్రెస్ తరపున వినోద్ అసూటి పోటీ చేస్తున్నారు. హవేరీ స్థానం నుంచి బీజేపీ తరపున మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పోటీ చేస్తుండటంతో ఈ స్థానంపైనా అందరి ఆసక్తి నెలకొన్నది.
మూడో విడతలో మధ్యప్రదేశ్లోని తొమ్మిది లోక్సభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. వీటిల్లో రాజ్గఢ్, గుణ, విదిశ స్థానాల్లో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. రాజ్గఢ్లో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో భోపాల్ నుంచి పోటీ చేసి ఓడిన దిగ్విజయ్ ఈసారి రాజ్గఢ్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి రొడ్మాల్ నాగర్ భారీ మెజారిటీతో విజయం సాధించి ఇప్పుడు హ్యాట్రిక్పై కన్నేశారు. ఇక, గుణ స్థానం బీజేపీ నేత, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. 37 ఏండ్లు, మూడు తరాల సింధియా కుటుంబసభ్యులు ఇక్కడ ఎంపీలుగా పని చేశారు. ఆయనపై కాంగ్రెస్ తరపున యదవేంద్ర సింగ్ యాదవ్ పోటీ చేస్తున్నారు. విదిశ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. గతంలో ఐదుసార్లు ఆయన ఇక్కడ ఎంపీగా గెలిచారు. 20 ఏండ్ల తర్వాత ఆయన మళ్లీ విదిశ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున ఆయనపై ప్రతాప్ భాను శర్మ పోటీకి నిలిచారు.
మూడో దశలో మహారాష్ట్రలోని 11 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో బారామతి, సతారా కీలక స్థానాలుగా ఉన్నాయి. బారామతి ఎన్సీపీకి, సీనియర్ నేత శరద్ పవార్కు కంచుకోటగా ఉంది. ఇక్కడ శరద్ పవార్ ఆరుసార్లు గెలవగా, గత మూడు ఎన్నికల్లో ఆయన కూతురు సుప్రియా సూలే విజయం సాధించారు. మరోసారి ఆమె పోటీలో ఉండగా, ఎన్సీపీ(అజిత్ పవార్) నుంచి అజిత్ పవార్ సతీమణి సునేత్ర పోటీ చేస్తున్నారు. ఇక, సతారా నుంచి వరుసగా గత ఆరు ఎన్నికల్లో ఎన్సీపీ విజయం సాధించింది. ఈసారి ఎన్సీపీ(శరద్ పవార్) తరపున శశికాంత్ షిండే పోటీ చేస్తుండగా బీజేపీ తరపున ఉదయన్రాజే భోసలే పోటీలో ఉన్నారు.
గుజరాత్లోని మొత్తం 26 స్థానాలకు మూడో దశలోనే పోలింగ్ జరగనుంది. గుజరాత్లో గాంధీనగర్, పోర్బందర్ కీలక లోక్సభ స్థానాలుగా ఉన్నాయి. గాంధీనగర్ నుంచి రెండోసారి హోంమంత్రి అమిత్ షా పోటీ చేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా సోనాల్ పటేల్ పోటీలో ఉన్నారు. ఇక, పోర్బందర్ నుంచి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మొదటిసారి పోటీ చేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థిగా లలిల్ వసోయా పోటీ చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని 13 లోక్సభ స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిల్లో మైన్పురి, ఫిరోజాబాద్, బదౌన్పై అందరి ఆసక్తి నెలకొన్నది. ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి కంచుకోట లాంటి మైన్పురిలో అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. గత పది ఎన్నికల్లో ఇక్కడ వరుసగా సమాజ్వాదీ పార్టీ గెలిచింది. ఫిరోజాబాద్, బదౌన్ స్థానాలను గత ఎన్నికల్లో 30 వేల ఓట్ల లోపు తేడాతో కోల్పోయింది. ఈ స్థానాలను తిరిగి కైవసం చేసుకునేందుకు సమాజ్వాదీ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తున్నది. ఈ రెండు స్థానాల్లోనూ ములాయం కుటుంబసభ్యులే పోటీ చేస్తున్నారు.