న్యూఢిల్లీ, మార్చి 18: దేశంలో ఐఏఎస్ అధికారుల కొరత వేధిస్తున్నది. మంజూరైన పోస్టుల్లో ఐదోవంతు భర్తీ కాకుండా ఖాళీగానే ఉంటున్నాయి. ఢిల్లీలో సైతం 25 శాతానికి పైగా ఐఏఎస్ అధికారుల పోస్టులు భర్తీ కాలేదు. ఆయ రాష్ర్టాల్లో ప్రభుత్వ పాలన, విధాన నిర్ణయాల అమలు, సంక్షేమ పథకాల అమలు కుంటు పడి మొత్తం పాలనా తీరుపైనే ప్రభావం పడుతున్నది. దీంతో అధికారులపై అదనపు భారం పడుతున్నది.
రాష్ర్టాలకు మంజూరైన ఐఏఎస్ పోస్టులకు, భర్తీ అయిన పోస్టులకు మధ్య వ్యత్యాసాన్ని ఇటీవల పార్లమెంట్ కమిటీ ఒకటి ప్రధానంగా ప్రస్తావించింది. మొత్తం 6,877 పోస్టులు ఉండగా, ప్రస్తుతం 5,577 మంది అధికారులు మాత్రమే సర్వీసులో ఉన్నారు. సుమారు 1300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం పోస్టుల సంఖ్యలో ఇది 18.9 శాతం. నాగాలాండ్లో 43.62 శాతం, కేరళలో 32.03 శాతం, మణిపూర్లో 30.43 శాతం, త్రిపురలో 27.45 శాతం, ఒడిశాలో 25.40 శాతం, సిక్కింలో 25 శాతం ఐఏఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.