Pune : మహారాష్ట్రలోని పూనేలో దారుణం జరిగింది. లాయర్ అయిన తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో మహిళను కొట్టి చంపింది అతడి భార్య. అంతేకాదు.. ఈ హత్యకు ఆమె కూతురు కూడా సహకరించింది. ఆ మహిళతో సంబంధం పెట్టుకున్న లాయర్ కూడా ఈ హత్యలో పాల్గొన్నాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూనేలో సంజయ్ సావంత్ అనే వ్యక్తి లాయర్గా కొనసాగుతున్నాడు. ఆయన వద్ద పూనమ్ దినేష్ మున్ (35) అనే వివాహిత మహిళ మూడున్నరేళ్లుగా అసిస్టెంట్గా పని చేస్తోంది.
ఈ క్రమంలో సంజయ్, పూనమ్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ అంశంపై గురువారం పూనమ్ను సంజయ్ సావంత్ భార్య స్వాతి సావంత్ (42), ఆమె కూతురు నిలదీశారు. సంజయ్ ఆఫీసుకు వెళ్లి పూనమ్తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో గొడవ పెరిగింది. దీంతో పూనమ్పై స్వాతి, ఆమె మైనర్ కూతురు దాడి చేశారు. ఆమెను కట్టేసి, బ్యాట్, కత్తివంటి ఆయుధాలతో దాడి చేశారు. దీంతో తీవ్రరక్తస్రావం కారణంగా పూనమ్ మరణించింది. ఈ ఘటన సమయంలో సంజయ్ కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. దాడి అనంతరం పూనమ్ మరణించడంతో ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు వారు ప్రయత్నించారు. పూనమ్ సాయంత్రం ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త సంజయ్కు ఫోన్ చేశాడు.
అయితే, పూనమ్ తన స్నేహితుల దగ్గరికి వెళ్తున్నట్లు చెప్పిందని సంజయ్ ఆమె భర్తకు చెప్పాడు. దీంతో అతడు రాత్రంతా తన భార్య కోసం ప్రయత్నించాడు. చివరకు శుక్రవారం ఉదయం వారి ఆఫీసుకు వెళ్లి చూడగా.. అక్కడ రక్తపు మడుగులో పూనమ్ మృతదేహం ఉంది. వెంటనే ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు.