ముంబై: అదానీ కుంభకోణంపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారని, కానీ ఆయన ప్రభుత్వం మాత్రం ఆవుల గురించి మాట్లాడుతున్నదని శివసేన(యూబీటీ) పత్రిక సామ్నా ఎద్దేవా చేసింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజును ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలని, ఆవులను కౌగిలించుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపును సామ్నా విమర్శించింది. అదానీ అంశంపై మాట్లాడాలని డిమాండ్ చేస్తున్న ప్రజలకు మతం డోసును ఇచ్చి నోర్లు మూయించాలని కేంద్రం భావిస్తున్నదని విమర్శించింది. ఈ ఏడాది వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు ఉన్నందున అభివృద్ధి చూపించి ఓట్లు అడిగేందుకు ఏ అభివృద్ధి జరగనందున రామమందిరం, ఆవుల పేరు మీద ఓట్లు పొందాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది.