BJP | హైదరాబాద్, జూన్ 15 (స్పెషల్ టాస్క్ బ్యూరో.. నమస్తే తెలంగాణ): దేశ ప్రజల కడుపు నింపేందుకు అందుబాటు ధరల్లో, సరిపడా ఆహార ధాన్యాలు లభించేలా చూడటం కేంద్రం బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చకుండా కేంద్రంలోని బీజేపీ సర్కారు చేతులెత్తేస్తున్నది. ముందుచూపు లేని వైఖరి కారణంగా దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతున్నది. ఫలితంగా వాటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మరోవైపు ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్(ఓఎంఎస్ఎస్) ద్వారా ఎఫ్సీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం కొనకుండా షరతు విధించింది. గోధుమలు, బియ్యం కొరత కారణంగా వీటి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట నూనెలు, కందిపప్పు సహా నిత్యావసర ధరలన్నీ పెరిగి పేదలు బతికే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఆకలి తీర్చే బియ్యం, గోధుమల ధరలు పెరుగుతుండటం పేదలకు దెబ్బ మీద దెబ్బ కానుంది.
కేంద్రం ప్రతి సీజన్లో ఆహార ధాన్యాల దిగుబడులు ఎలా ఉండనున్నాయో శాస్త్రీయ అంచనాకు రావాలి. డిమాండ్కు తగ్గట్టుగా దిగుబడులు ఉండవనుకుంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ముందస్తు ప్రణాళికలు ఉండాలి. కానీ, ఈ ముందుచూపు కేంద్రానికి కొరవడింది. దీని ఫలితంగానే గోధుమలు, బియ్యం కొరత ఏర్పడుతున్నది. పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు గోధుమల నిల్వలపై వచ్చే ఏడాది మార్చి 31 వరకు పరిమితి విధిస్తున్నట్టు కేంద్రం ఈ నెల 12న ప్రకటించింది. హోల్సేల్ వ్యాపారులు గరిష్ఠంగా 3 వేల మెట్రిక్ టన్నులు, రిటైలర్లు 10 మెట్రిక్ టన్నులు, ఫుడ్ ప్రాసెసర్లు మొత్తం సామర్థ్యంలో 75 శాతం మాత్రమే నిల్వ చేసుకోవాలని పరిమితి విధించింది. మన దేశంలో చివరగా 2006 ఆగస్టులో గోధుమల నిల్వలపై పరిమితి విధించింది. మళ్లీ ఇన్నేండ్లకు పరిమితి విధించాల్సి వచ్చిందంటే ముంచుకొస్తున్న కొరత, పెరుగుతున్న ధరల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 2022 ఏప్రిల్లో ఎఫ్సీఐ వద్ద కేంద్రం కోటాలో 323.22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉండగా ఈ ఏప్రిల్లో 248.60 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నాయి. 2022 ఏప్రిల్లో 189.90 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు ఉండగా, ఈ ఏప్రిల్లో 83.45 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నాయి. బియ్యం, ఆహార ధాన్యాల కొరతకు ఈ లెక్కలే నిదర్శనం.
దేశంలో తరచూ ఏదో ఒక ఆహార ధాన్యం కొరత ఏర్పడటం, ధరలు విపరీతంగా పెరిగి పేదలకు పెనుభారంగా మారడం బీజేపీ హయాంలో సాధారణ అంశంగా మారిపోయింది. ఇటీవల వంట నూనెలు, కంది పప్పు ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు గోధుమలు, బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. కేంద్రం లెక్కల ప్రకారమే.. గత నెల రోజుల్లో మార్కెట్లో గోధుమల ధరలు 8.13 శాతం పెరిగాయి. అధికార లెక్కల ప్రకారం ఏడాదిలో బియ్యం ధరలు 10 శాతం పెరిగాయి. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఈ ధరలు మరింత ఎక్కువే పెరిగాయి.
ఎఫ్సీఐ నుంచి ఈ-వేలంలో పాల్గొనాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార ధాన్యాలను కొనుగోలు చేసుకునేందుకు కేంద్రం ఓఎంఎస్ఎస్ ద్వారా అవకాశం కల్పిస్తూ జనవరి 26న నిర్ణయం తీసుకున్నది. కానీ ఈ నిర్ణయం జరిగి ఆరు నెలలు కూడా గడవక ముందే కేంద్రం మాట మార్చింది. ఇప్పుడు ఓఎంఎస్ఎస్ నుంచి ఈశాన్య రాష్ర్టాలు మినహా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను తొలగించాలని ఎఫ్సీఐను కేంద్రం ఆదేశించింది. చాలా రాష్ర్టాలు సొంతంగా పేదలకు ఆహారధాన్యాలు అందించే పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాల కోసం సరిపడా నిల్వలు లేని రాష్ర్టాలు ఎఫ్సీఐ నుంచి కొంటాయి. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ పథకాల అమలుకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్నది.
అధికారుల లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏప్రిల్లో 5.23 లక్షల హెక్టార్లలో గోధుమ పంట నష్టం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో దిగుబడులు తగ్గుతున్నందున ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, కేంద్రం చేతులు ముడుచుకొని కూర్చున్నది. ఫలితంగా గోధుమల కొరత ముంచుకొస్తున్నది. ప్రస్తుతం గోధుమలపై దిగుమతి సుంకం 40 శాతం ఉన్నది. దీంతో వ్యాపారులు ఇతర దేశాల నుంచి గోధుమల దిగుమతికి వెనకాడుతున్నారు.
బెంగళూరు, జూన్ 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలో ‘అన్నభాగ్య’ పథకం కింద ప్రతి ఒక్కరికి నెలకు 10 కిలోల బియ్యం ఇస్తామని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. ఈ పథకానికి అవసరమైన బియ్యం కోసం ఎఫ్సీఐతో పాటు తెలంగాణ ప్రభుత్వంతో కర్ణాటక సర్కారు సంప్రదింపులు జరిపింది. కిలోకు రూ.36.6 చొప్పున బియ్యం సరఫరా చేసేందుకు ఎఫ్సీఐ అంగీకరించింది. కానీ ఓఎంఓస్ఎస్ నుంచి ఈశాన్య రాష్ర్టాలు మినహా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను తప్పించాలని కేంద్రం సూచించినందున బియ్యం సరఫరా చేయబోమని కర్ణాటక ప్రభుత్వానికి ఎఫ్సీఐ ఈ నెల 12న లేఖ రాసింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం తెలంగాణపై ఆశలు పెట్టుకున్నది. తెలంగాణ వద్ద అదనంగా 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయి.