భువనేశ్వర్, జూలై 1: ఒడిశా రైలు ప్రమాదానికి సిగ్నలింగ్, ఆపరేషన్స్(ట్రాఫిక్) విభాగాలదే బాధ్యతని రైల్వే భద్రతా కమిషనర్ రైల్వే బోర్డుకు నివేదించారు. గత నెల 28న నివేదిక సమర్పించినట్టు సమాచారం. ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున నివేదికలోని విషయాలను బయటకు వెల్లడించలేదని ఆయన తెలిపారు. సిగ్నలింగ్ నిర్వాహకుడు మరమ్మతుల కోసం స్టేషన్ మాస్టర్కు ‘డిస్కనెక్షన్ మెమో(ఇంటర్ లాకింగ్ వ్యవస్థను షట్ డౌన్ చేసి పని ప్రారంభించేందుకు ఇచ్చే ఆదేశం) ఇచ్చాడని, పని అయిన తర్వాత ‘రీకనెక్షన్ మెమో’ జారీ చేశారని.. దీని ప్రకారం ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిగ్నలింగ్ వ్యవస్థ పని చేస్తున్నదని నివేదికలో తెలిపారు. అయితే ఒక రైలును స్టేషన్లోకి అనుమతించేముందు పాటించాల్సిన సిగ్నలింగ్ వ్యవస్థ తనిఖీ సేఫ్టీ ప్రోటోకాల్ను ప్రమాద సమయంలో పాటించలేదని రైల్వే బోర్డు అధికారి ఒకరు తెలిపారు.
వాస్తవానికి టెక్నీషియన్ పని పూర్తి కాలేదని భావించి సిస్టమ్ను బైపాస్ చేసి లొకేషన్ బాక్స్ నుంచి కోరమాండల్ ఎక్స్ప్రెస్కు గ్రీన్ సిగ్నల్ వచ్చేట్టు చేశాడని వివరించారు. మొత్తానికి ‘సిగ్నలింగ్ ఇంటర్ఫిరెన్స్(జోక్యం)’ వల్ల కోరమాండల్ ఎక్స్ప్రెస్ లూప్లైన్లోకి వచ్చి గూడ్స్ రైలును ఢీ కొన్నదని ఆ అధికారి చెప్పారు. కాగా, ప్రమాదంలో మరణించిన 76 మంది మృతదేహాలు ఇంకా మార్చురీలోనే ఉన్నాయని, ఇందులో 29 మృతదేహాలను గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించామని అధికారులు తెలిపారు.