న్యూఢిల్లీ: నేరస్థులను ముందస్తుగా అరెస్టు చేసేందుకు సంబంధించిన తెలంగాణ చట్టాన్ని ఢిల్లీలో అమలు చేసే ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదించి కేంద్ర హోంశాఖకు పంపినట్టు అధికార వర్గాలు తెలిపాయి. నేరపూరిత కార్యకలాపాలను కఠినంగా అదుపు చేసేందుకు తెలంగాణ ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం-పీడీ యాక్ట్ (1986)ను ఢిల్లీకి వర్తింపజేయాలని ఢిల్లీ పోలీసులు గత జూన్లో ప్రతిపాదించారు.
అక్రమసారా తయారీదారులు, మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారులు, నకిలీ పత్రాల తయారీదారులు, గొలుసుదొంగలు, ఇండ్లల్లో దోపిడీలకు పాల్పడేవారు, ఆయుధ వ్యాపారులు, జూద నిర్వాహకులు, లైంగిక నేరస్థులు, సైబర్ క్రిమినల్స్ మొదలైనవారిపై ఆ చట్టాన్ని ప్రయోగిస్తారు. కేంద్ర హోంశాఖ తుది నిర్ణయం తీసుకొన్న తర్వాత చట్టం ఢిల్లీలో అమలవుతుంది. శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగించే అవకాశమున్న నేరాల నిరోధానికి ఆ చట్టాన్ని ప్రయోగిస్తారు. ఢిల్లీ పరిధిలో అది అమలైతే లెఫ్టినెంట్ గవర్నర్ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారి అరెస్టుకు ఆదేశాలు జారీచేసే అధికారం పొందుతారు.
చట్టం దుర్వినియోగం కాకుండా ఓ సలహా బోర్డు ఉంటుంది. అరెస్టును ఆమోదించడం, పొడిగించడం బోర్డు అధికార పరిధిలో ఉంటుంది. అరెస్టు మొదటిసారి 6 మాసాలకు మించకుండా ఉండాలి. గరిష్టంగా అది 12 మాసాల వరకు ఉండొచ్చు. జడ్జీలు లేదా జడ్జీగా నియామకానికి అర్హత కలిగిన వ్యక్తులతో బోర్డు ఏర్పాటవుతుంది.