PM Modi | న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ప్రముఖ సైన్స్ జర్నల్ ‘ది లాన్సెట్’ ఘాటుగా విమర్శించింది. దేశంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ చర్యలు అంతంత మాత్రంగా ఉన్నాయని దుయ్యబట్టింది. అవసరంలో ఉన్నవారికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందడం లేదని తెలిపింది. ఆరోగ్య సంరక్షణ రంగంపై ప్రభుత్వ వ్యయం తగ్గిపోయిందని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కేవలం 1.2 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నదని చెప్పింది. ప్రజల జేబులకు భారీగా చిల్లు పడుతున్నదని వివరించింది. ‘భారత దేశంలో ఎన్నికలు : సమాచార పారదర్శకత ఎందుకు ముఖ్యం?” అనే శీర్షికతో ది లాన్సెట్ ఇటీవల ఒక వ్యాసాన్ని ప్రచురించింది.
ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ప్రజారోగ్య, సార్వజనీన ఆరోగ్య బీమా పథకాలు విఫలమవుతున్నాయని ది లాన్సెట్ విమర్శించింది. ఆరోగ్య సంరక్షణ పథకాలు, ప్రణాళికలు, నిర్వహణ కోసం తాజా సమాచారం తప్పనిసరి అని, కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిని పట్టించుకోవడం లేదని తెలిపింది. కొవిడ్ మహమ్మారి కారణంగా 2021లో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ వాయిదా పడిందని గుర్తు చేసింది. భారత దేశం, ప్రజల గురించి సమగ్ర అధికారిక సమాచారం తెలియకుండాపోయిన దశాబ్దం 150 ఏండ్లలో ఇదేనని చెప్పింది. జాతీయ, రాష్ట్ర స్థాయి ఆరోగ్య సర్వేలకు కూడా తాజా జనాభా లెక్కలు అవసరమని తెలిపింది.
రోగాల బారిన పడటం, వాటిని నయం చేసుకోవడానికి ప్రజలు చేసే ఖర్చు వంటివాటిపై నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ నిర్ణీత కాలంలో క్రమబద్ధంగా సర్వే చేయవలసి ఉంటుందని, దీనిని ఇప్పట్లో నిర్వహించే సూచనలు కనిపించడం లేదని తెలిపింది. జనన, మరణాలకు సంబంధించిన నమ్మదగిన సమాచారం శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సర్వే నివేదికలో ఉంటుందని, దీనికి సంబంధించిన 2021నాటి నివేదికను విడుదల చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతున్నదో చెప్పడం లేదని తెలిపింది. పేదరికానికి సంబంధించిన సర్వే నివేదికలను కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారు బయట పెట్టడం లేదని చెప్పింది.
వాస్తవ పరిస్థితులను బయటపెట్టడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ది లాన్సెట్ ప్రశ్నించింది. సమాచారం లేకుండా ప్రగతిని ఏ విధంగా మదింపు చేస్తారని నిలదీసింది. తాజా, నమ్మదగిన సమాచారం అందుబాటులో లేకపోతే, ప్రజాస్వామిక ఎంపికలు నీరుగారిపోతాయని చెప్పింది. అభివృద్ధి చెందిన భారత్, 2047 లక్ష్యమని ప్రభుత్వం చెప్తున్నదని, దీనికి చోదకులు ప్రజలు, సేవలేనని, అందువల్ల ప్రభుత్వం ఆరోగ్యం, విద్యలపై దృష్టి సారించి, పెట్టుబడులు పెట్టాలని వివరించింది. సమాచారం బహిరంగంగా, పటిష్టంగా అందుబాటులో ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయని స్పష్టం చేసింది. సమాచారాన్ని అందుబాటులో ఉంచడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటే, భారతీయులకు సంపూర్ణ సమాచారాన్ని ఇవ్వడం లేదనే భావించాలని తెలిపింది.