న్యూఢిల్లీ/ సిటీబ్యూరో (హైదరాబాద్), జనవరి 26 ( నమస్తే తెలంగాణ ): దేశంలో నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. గోధుమ, గోధుమపిండి ధరలు పదేండ్ల గరిష్ఠానికి చేరాయి. బియ్యం రేట్లు కూడా భారీగా పెరిగాయి. వంటనూనె, ఉప్పు, పప్పు వంటి ఇతర నిత్యావసరాలదీ అదే పరిస్థితి. ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కుదేలవుతున్నారు. దీంతో వైద్యం, ఇతర అత్యవసర ఖర్చులకు దాచుకున్న డబ్బు కూడా బయటకు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాల వల్లే దేశంలో ధరలు మండుతున్నాయని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ వెబ్సైట్ ప్రకారం చూసినా ధరలు ఏడాదిలోనే ఎంతగా పెరిగాయో అర్థమవుతున్నది. సరిగ్గా ఏడాది కిందట బియ్యం ధర కిలోకి రూ.35.74 ఉండగా, ఈ ఏడాది జనవరి 25న రూ.38.25కు పెరిగింది. గోధుమ పిండి ధర గత ఏడాది ఇదే సమయానికి కిలోకు రూ.28.24 ఉండగా ఈ ఏడాది జనవరి 25 నాటికి రూ.33.43కు పెరిగింది. కందిపప్పు గతేడాది కిలో ధర రూ.102.7 ఉండగా ఇప్పుడు రూ.111.95కి చేరింది. బహిరంగ మార్కెట్లలో ఈ ధరలు ఇంకా ఎక్కువే ఉన్నాయి. మిగతా ఆహార ధాన్యాల ధరలూ ఇదే రకంగా పెరుగుతున్నాయి.
పెరుగుతున్న ధరలను అదుపు చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) వద్ద ఉన్న నిల్వల నుంచి కొంత మేర బహిరంగ మార్కెట్లో విక్రయించాలని నిత్యావసరాల ధరలపైన ఏర్పడిన మంత్రుల కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎఫ్సీఐ వద్ద 158 లక్షల టన్నుల గోధుమలు నిల్వ ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఎఫ్సీఐ వద్ద కనీసం 138 టన్నుల గోధుమలు నిల్వ ఉండాలి. పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు ఎఫ్సీఐ నుంచి 30 లక్షల టన్నుల గోధుమలను బహిరంగ మార్కెట్లో విక్రయించనున్నారు. ఇందుకు గానూ క్వింటాలుకు కనీస ధరగా రూ.2,350 నిర్ణయించారు. ఒక్కో వ్యాపారి మూడు వేల టన్నుల కంటే ఎక్కువ కొనకుండా పరిమితి విధించారు. అయితే, బహిరంగ మార్కెట్కు ఎఫ్సీఐ నుంచి గోధుమలను సరఫరా చేసినా కూడా రూపాయి, రెండు రూపాయలకు మించి ధర తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నిల్వలు మార్కెట్లోకి చేరడానికి కనీసం 15 రోజుల సమయం పట్టవచ్చు.
దేశంలో గోధుమల ఉత్పత్తి గత ఏడాది తగ్గింది. అంతకుముందు ఏడాది 109.59 మిలియన్ టన్నుల గోధుమలు ఉత్పత్తి కాగా, 2021 – 22 పంట సంవత్సరంలో 106.84 మిలియన్ల టన్నులకు గోధుమల ఉత్పత్తి తగ్గింది. ఇదే సమయంలో ఎఫ్సీఐ గోధుమల కొనుగోళ్లు కూడా భారీగా తగ్గిపోయింది. గత ఏడాది 43 మిలియన్ టన్నుల గోధుమలను ఎఫ్సీఐ కొనగా ఈసారి కేవలం 19 టన్నుల మాత్రమే కొనుగోలు చేసింది.
డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగి, సరుకు రవాణా ఖర్చులు పెరిగాయి. దాని ప్రభావం నిత్యావసర సరుకుల ధరలపై పడుతున్నది. దేశంలో పప్పులు, నూనె గింజలు మినహాయించి మిగతా అన్ని రకాల వస్తువులు సమృద్ధిగా ఉన్నాయి. అయినా విదేశీ మారక ద్రవ్యం పెంచుకునేందుకు కేంద్రం వాటి ఎగుమతులను ప్రోత్సహిస్తున్నది. ఫలితంగా దేశీయంగా వాటి ధర పెరుగుతున్నది. దిగుమతులపై సుంకాలు విధించడంతో పప్పులు, నూనెల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం ఆహార సబ్సిడీల్లో కోతలు విధిస్తున్నది. 2022-23 బడ్జెట్లో ఆహార సబ్సిడీల్లో 28 శాతం, ఎరువుల సబ్సిడీల్లో 25 శాతం, ఇంధన సబ్సిడీల్లో 11 శాతం మేర కోత విధించింది. ఇలా నిత్యావసర ధరలు పెరుగుతుంటే విలాస వస్తువుల ధరలు తగ్గుతుండటం కేంద్ర అసమర్థ ఆర్థిక విధానానికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు.