BJP | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు పాలనలో పేద, మధ్య తరగతి జీవులకు ఇక పస్తులే దిక్కయ్యేట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వానికి ముందుచూపు కొరవడటం, డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. కందిపప్పు, గోధుమలు, బియ్యం, టమాటలతో పాటు పాలు, పాల ఉత్పత్తుల ధరలకు రెక్కలు వచ్చాయి. ధర ఎక్కువైనప్పటికీ ఈ సరుకులను కొనుగోలు చేద్దామంటే కొన్ని ప్రాంతాల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే వాస్తవాలను తోసిపుచ్చుతూ.. నిత్యావసర వస్తువులకు కొరతేమీ లేదంటూ కేంద్ర మంత్రులు అబద్ధాలతో మభ్య పెట్టాలని ప్రయత్నిస్తుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తున్నది.
ఏది తాకినా.. పిరం
మొన్నటి వరకూ వంట నూనెల ధరలు సామాన్యులను బెంబేలెత్తించగా తాజాగా కందిపప్పు పెద్ద రందిగా మారింది. కిలో ధర రూ.150 వరకు చేరుకొన్నది. పిరం అయినప్పటికీ.. పప్పు కొనుగోలు చేద్దామని సూపర్ మార్కెట్లు, డిపార్ట్మెంటల్ స్టోర్లు, కిరాణా దుకాణాలకు వెళ్లిన కస్టమర్లకు ‘నో స్టాక్’, ‘లిమిటెడ్ సేల్’ బోర్డులే కనిపిస్తున్నాయి. డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతోనే కందిపప్పు కొరత ఏర్పడిందని వ్యాపారులు చెప్తున్నారు.
ఇక మొన్నటి వరకూ కిలో రూ.30 పలికిన టమాటాలు ప్రస్తుతం రూ.100 దాటాయి. నైరుతి రుతు పవనాలు ఆలస్యం కావడం తదితర కారణాల వల్ల ధరలు ఒక్క వారంలోనే అమాంతంగా పెరిగిపోయాయని వ్యాపారులు చెప్తున్నారు. ఒకవైపు, కంది, టమాటా ధరలకు రెక్కలు రాగా.. గోధుమల నిల్వలపై ఇటీవల కేంద్ర ఆహార శాఖ పరిమితులు విధించింది. మరోవైపు ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్(ఓఎంఎస్ఎస్) ద్వారా ఎఫ్సీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం కొనకుండా షరతు విధించింది.
రానున్న రోజుల్లో గోధుమలు, బియ్యం కొరత ఏర్పడనున్నదన్న సంకేతాలను ఈ నిర్ణయాలు సూచిస్తున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పులిమీద పుట్రలా పాల ఉత్పత్తుల కొరత కూడా క్రమంగా పెరుగుతున్నది. అమూల్, మదర్ డెయిరీ తదితర పాల ఉత్పత్తి కంపెనీల ఏకపక్ష నిర్ణయాలు, రైతులకు చెల్లింపుల్లో కోత, ప్రభుత్వ అలసత్వం వెరసి ఈ దుస్థితికి కారణంగా తెలుస్తున్నది.
కర్ణాటక, తమిళనాడులో డిమాండ్కు తగిన విధంగా పాలు సరఫరా కావట్లేదని అక్కడి వ్యాపారులు ఆరోపిస్తున్నారు. గడిచిన ఏడాది వ్యవధిలో మదర్ డెయిరీ లీటర్ పాలపై రూ.10 ధరను పెంచడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నది. పరిస్థితులను అంచనా వేసి, ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని, అందుకే ధరా భారం పెరిగిపోయిందని ప్రజలు మండిపడుతున్నారు.