న్యూఢిల్లీ: దేశంలో వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. తాజాగా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ.101 పెంచాయి. అంతకుముందు కూడా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కలిపి వాణిజ్య సిలిండర్ ధరన రూ.250 మేర పెరిగింది. అక్టోబర్లో మరో రూ.200 పెంచారు. ఇప్పుడు ఇంకో రూ.100 పెంచడంతో ఇటీవల తగ్గింపుతో లభించిన ఉపశమనం ఆవిరైనట్లయ్యింది.
కాగా, తాజా పెంపుతో కలిపి దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1,833కు చేరింది. అంతకుముందు ఇది రూ.1,732గా ఉండేది. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో రూ.1,999.50 కి, పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో రూ.1,943 కి, మహారాష్ట్ర రాజధాని ముంబైలో రూ.1,785.50కి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. పెంచిన కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే, 14.2 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం మారలేదు. ఆగస్టు 30న వీటి ధరను రూ.200 తగ్గించారు.
జెట్ ఇంధన ధరల్లోనూ పెంపు
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలేగాక విమాన ఇంధన ధరల (ATF Price) ను కూడా చమురు విక్రయ సంస్థలు పెంచాయి. ఒక్కో కిలో లీటరుపై అదనంగా మరో రూ.1,074 భారం వేశాయి. దాంతో ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ.1,11,344.92కు చేరింది. ఇలా జెట్ ఇంధనం ధర పెరగడం గత ఐదు నెలల్లో ఐదోసారి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం గత 19 నెలలుగా ఎటువంటి మార్పు లేదు. కాగా, ప్రతి నెల 1వ తేదీన వంటగ్యాస్తోపాటు ఏటీఎఫ్ ధరలను ప్రభుత్వరంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లు ప్రతినెల సవరిస్తుంటాయి.