(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొంటున్న అనాలోచిత నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వడ్ల కొనుగోళ్ల విషయంలో ‘కొంటామని ఒకసారి, నిల్వలు పెరిగిపోయాయి. ఇప్పుడు కొనబోమం’ అంటూ మరోసారి ద్వంద్వ వైఖరిని ప్రదర్శించిన కేంద్రం.. పవన్హన్స్ విక్రయంలోనూ ఇదే తీరును పాటించింది. విపక్షాలు విమర్శించినప్పటికీ, అవేమీ పట్టించుకోకుండా తొలుత పవన్హన్స్ విక్రయంపై ఏకపక్షంగా ముందుకు వెళ్లిన కేంద్రం.. ఇప్పుడు ఆ డీల్ను పక్కనబెట్టింది. గతంలో పెద్ద నోట్లను రద్దు చేసిన మోదీ సర్కారు.. రూ. 2 వేల కొత్త నోటును తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని కూడా రద్దు చేసింది. మాటిమాటికీ నిర్ణయాలను మార్చుకోవడం కేంద్రానికి నిత్యకృత్యంగా మారిపోయింది. ఇప్పుడు ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ విషయంలోనూ బీజేపీ సర్కారు మళ్లీ అదే ధోరణితో ముందుకెళ్తున్నది. దేశ భద్రతకు సంబంధించి ఇలాంటి కీలక నిర్ణయాలపై కేంద్రం ప్రవర్తిస్తున్న తీరుపై నిపుణులు మండిపడుతున్నారు. నాలుగేండ్లలో ఇస్తున్న ట్రైనింగ్ చాలా కఠినంగా ఉండటంతో అగ్నివీరుల్లో చాలామంది ఇండ్లకు వెళ్లి తిరిగి రావట్లేదని సమాచారం.
కోటా పెంపునకు ప్రతిపాదనలు
తివిధ దళాల్లో వేతనాలు, పింఛన్ల భారాన్ని తగ్గించుకోవాలని 2022లో ‘అగ్నిపథ్’ పేరిట ఓ స్కీమ్ను కేంద్రం తీసుకొచ్చింది. మెరుగైన ప్రతిభ చూపిన 25 శాతం మందిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని పేర్కొంది. అయితే నాలుగేండ్ల శిక్షణ తర్వాత మిగిలిన 75శాతం మంది నిరుద్యోగులుగా మారాల్సిందే. దీనిపై దేశవ్యాప్తంగా పెద్దయెత్తున నిరసనోద్యమాలు జరిగాయి. మాజీ సైనిక ఉద్యోగులు, నిపుణులు సహా పలువురు కేంద్రం తీరును తప్పుబట్టారు. 25 శాతంగా ఉన్న శాశ్వత కోటాను పెంచాల్సిందిగా డిమాండ్ చేశారు. అయితే, కేంద్రం ఈ ప్రతిపాదనకు ససేమీరా అన్నది.