Smart Meters | వడోదర, మే 25: తమ ఇండ్లకు బలవంతంగా అమర్చిన ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను వెంటనే తీసేసి పాత మీటర్లను పెట్టాలని డిమాండ్ చేస్తూ గుజరాత్లో జనం రోడ్డెక్కుతున్నారు. వడోదరలో గత నెల మొదలైన ఈ ఆందోళనలు క్రమంగా సూరత్, రాజ్కోట్, జామ్నగర్, ఆనంద్, గోద్రా, దాహోద్ నగరాలకు విస్తరించాయి. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజలు విద్యుత్తు కార్యాలయాల ముందు నిరసనలు తెలుపుతున్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత తమ విద్యుత్తు బిల్లులు భారీగా పెరిగిపోయాయని, పదే పదే కరెంటు పోతున్నదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా నిరసనల్లో పాల్గొంటున్నాయి.
దేశవ్యాప్తంగా విద్యుత్తు కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఇందుకోసం గుజరాత్కు గత ఐదేండ్లలో రూ.16,663 కోట్లు మంజూరు చేసింది. ఆ రాష్ట్రంలో పాత మీటర్ల స్థానంలో 1.64 కోట్ల స్మార్ట్ మీటర్లను అమర్చాలని ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికి 60 వేల స్మార్ట్ మీటర్లను ఇన్స్టాల్ చేశారు. ఈ మీటర్లను విద్యుత్తు కార్యాలయాల నుంచి ఆపరేట్ చేయొచ్చు. విద్యుత్తు ఎంత వాడారనేది ప్రతి అరగంటకు ఒకసారి వినియోగదారుడి ఫోన్కు, సరఫరా సంస్థకు అప్డేట్స్ వెళ్తాయి. మీటరు వేడెక్కినా, ఏమైనా సమస్యలు ఉన్నా విద్యుత్ కార్యాలయం నుంచి మీటరును నిలిపివేసి, మళ్లీ ప్రారంభించవచ్చు. వినియోగదారులు ముందుగానే రీఛార్జ్ చేసుకొని విద్యుత్తును వినియోగించుకోవాలి. ఇందుకోసం ఎప్పుడూ రూ.300 మినిమం బ్యాలెన్స్ కలిగి ఉండాలి.
అకౌంట్లో బ్యాలెన్స్ అయిపోగానే ఆటోమెటిక్గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. విద్యుత్ వినియోగం గత ఏడు రోజుల సగటు కంటే పెరిగినప్పుడు, అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ రెండు రోజులకు మించి వచ్చే అవకాశం లేనప్పుడు, అకౌంట్లో డబ్బులు అయిపోయినప్పుడు వినియోగదారుల ఫోన్కు అప్డేట్స్ వెళ్తూ ఉంటాయి. అయితే, ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టుకోకపోతే రూ.10 వేల జరిమానా వేస్తామని బలవంతంగా అమర్చారని, ఇప్పుడు తమ విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్మార్ట్ఫోన్లు లేని వారి పరిస్థితి ఏంటని, నిరక్షరాస్యులు ఎలా ఈ స్మార్ట్ మీటర్లను అర్థం చేసుకోగలరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో విద్యుత్ సరఫరా సంస్థలు తాత్కాలికంగా ఈ స్మార్ట్ మీటర్లను అమర్చే కార్యక్రమాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.