Manipur Violence | న్యూఢిల్లీ, జూలై 27: పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. మణిపూర్ అంశంపై మొదటి నుంచి పట్టు విడవని ప్రతిపక్షాలు తమ ఆందోళనలను గురువారం కూడా కొనసాగించాయి. లోక్సభలో విపక్ష సభ్యులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. మణిపూర్ అంశంపై నినాదాలతో సభను హోరెత్తించారు. వివిధ బిల్లుల ప్రతులను విపక్ష సభ్యులు చింపడంతో సభలో గందరగోళం నెలకొన్నది.
విపక్ష సభ్యుల ఆందోళనలతో గురువారం మొత్తానికి మూడు సార్లు సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ రెండోసారి ప్రారంభమయ్యాక విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశాంగ విధానంపై మాట్లాడారు. దీనిపై విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. అనంతరం కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధురీ మాట్లాడేందుకు ప్రయత్నించగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అడ్డుతగిలారు. జైశంకర్ ప్రసంగానికి అడ్డుతగిలారని, అందుకే మీకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని గోయల్ తెలిపారు. మరోసారి ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో సభ వాయిదా పడింది.
రెండు బిల్లులకు ఆమోదం…
ప్రతిపక్షాల నిరసనల మధ్యనే కేంద్రం రెండు బిల్లులను లోక్సభలో ఆమోదింపజేసుకున్నది. ఈజ్ ఆఫ్ బిజినెస్కు సంబంధించిన జన్ విశ్వాస్ (చట్ట సవరణ) బిల్లును లోక్సభ ఆమోదించింది. దీంతో పాటు మరో బిల్లును లోక్సభ ఆమోదించింది.
బీఏసీ సమావేశం బహిష్కరణ…
మణిపూర్ అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్షాలు గురువారం జరిగిన రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాన్ని బహిష్కరించాయి. కమిటీలో సభ్యులైన జైరామ్ రమేశ్ (కాంగ్రెస్), మీసా భారతి (ఆర్జేడీ), డెరెక్ ఓబ్రియన్ (టీఎంసీ) సమావేశం నుంచి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కూడా సమావేశానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్, టీఎంసీ, ఆర్జేడీ, లెఫ్ట్, డీఎంకే, ఎన్సీపీ, ఆప్ తదితర పార్టీలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. ఈనెల 20న జరిగిన బీఏసీ సమావేశాన్ని కూడా ప్రతిపక్షాలు బహిష్కరించిన విషయం విదితమే.
29న విపక్షాల మణిపూర్ సందర్శన
హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోతున్న మణిపూర్ను విపక్ష పార్టీలు సందర్శించనున్నాయి. ఈల 29, 30న ఇండియా కూటమికి చెందిన విపక్ష సభ్యులు అల్లర్ల బాధితులను కలవనున్నారు. మొత్తం 20 మంది ఎంపీలు పర్యటనలో భాగం కానున్నట్టు కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ వెల్లడించారు. లోయతో పాటు మైదాన ప్రాంతాల్లోని వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ప్రజలతో మమేకం అవ్వనున్నట్టు అయన తెలిపారు. పునరావాస శిబిరాలను సందర్శించనున్నట్టు పేర్కొన్నారు.