(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్(నమస్తే తెలంగాణ): ఈవీఎం, వీవీప్యాట్ లోపాలపై నాలుగేండ్లుగా ప్రశ్నిస్తున్నా ఎందుకు స్పందిం చడంలేదని కేంద్రాన్ని విపక్షం నిలదీసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (ఈవీఎం), ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష నేతలు, నిపుణులు ఇప్పటికే ఎన్నికల సంఘానికి (ఈసీ) పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఈవీఎం, వీవీప్యాట్లలోని ఓట్ల సంఖ్యలో ఏమైనా వ్యత్యాసాన్ని గుర్తించారా? అంటూ 2019 లోక్సభ ఎన్నికల అనంతరం పలువురు విపక్ష ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. అయితే, నాలుగేండ్లు గడిచినప్పటికీ, ఇంకా దానిపై కేంద్రం స్పష్టతనివ్వలేదు. ఇదే అంశంపై పార్లమెంట్లో ఓ సభ్యుడు తాజాగా ప్రశ్నించారు. కేంద్రం స్పందిస్తూ.. దీనిపై పలుమార్లు సంప్రదించినా ఈసీ స్పందించలేదని చెప్పుకొచ్చింది.
సందేహాలు తీర్చాల్సిందే
మరికొద్దీ రోజుల్లో ఐదు రాష్ర్టాల అసెంబ్లీలు, లోక్సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఈవీఎం, వీవీప్యాట్లపై నెలకొన్న అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత ఈసీపై ఉన్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంటరీ ప్యానెల్ న్యాయశాఖకు కీలక సూచన చేసింది. ఈవీఎం, వీవీప్యాట్ల మధ్య ఓట్ల సంఖ్యలో వ్యత్యాసాలకు సంబంధించిన వివరాలను వెంటనే తెప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.