Parliament | న్యూఢిల్లీ, మే 27 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్రానికి ముందు, అనంతరం ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది పాత పార్లమెంటు భవనం. భారత ప్రజాస్వా మ్య స్ఫూర్తికి చిహ్నంగా నిలిచిందీ భవనం. రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై నిరసన గళం వినిపించేందుకు డబ్భు ఐదేండ్లుగా వేదికగా నిలిచింది ఈ ప్రాంగణం. ఇంత ఘన చరిత్ర కలిగిన ఈ భవనం ఇకపై ఎలా ఉండనుంది? నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం కానున్న నేపథ్యంలో పాత భవనం పరిస్థితేంటి? అన్నదానిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొన్నది. కొత్త భవనం ప్రారంభించిన తర్వాత పాత భవనాన్ని ఏం చేయనున్నారనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టతనివ్వలేదు.
ఈ విషయమై మార్చి 2021లో రాజ్యసభలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ ఒక ప్రకటన చేశారు. కొత్త పార్లమెంట్ భవనం సిద్ధమైన తర్వాత, పాత పార్లమెంట్ భవనానికి మరమత్తులు చేసి ప్రత్యామ్నాయ వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే దీనిపై ఇంకా సమగ్రమైన ఆలోచన చేయలేదని కూడా చెప్పారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనం దేశపు పురావస్తు సంపదగా పరిరక్షించబడుతుందని చెప్పారు. 1927లో ప్రారంభమైన ఈ భవనంలో 1956లో మరో రెండంతస్తులు నిర్మించారు. 2006లో ఒక దేశ 2500 ఘన చరిత్రను ప్రతిబింబించేలా పార్లమెంట్ ప్రాంగణంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు.
పాత పార్లమెంట్ ప్రాంగణంలో మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలతో పాటు దేశానికి ప్రధానులుగా, రాష్ట్రపతులుగా సేవలందించినవారు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖుల విగ్రహాలు సుమారు 50 దాకా, ప్రముఖుల చిత్రపటాలు 105, పెయింటింగులు 60 ఉన్నాయి. ఎంపీల నిరసనలకు గాంధీ విగ్రహం వేదికగా నిలిచింది. దేశానికి సేవలందించిన ప్రముఖుల విగ్రహాలు, చిత్రపటాలను కొత్త పార్లమెంటు భవనంలో ఏర్పా టు చేయనున్నారా? వాటికి అంతే ప్రాధాన్యం ఇవ్వనున్నారా? అనే అంశాలపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉన్నది.