న్యూఢిల్లీ, జూలై 29: దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. 2018 లో 2,967గా ఉన్న పులుల సంతతి 2022 నాటికి 3,682కు పెరిగింది. శనివారం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ఈ గణాంకాలను విడుదల చే సింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల్లో 75 శాతం ఒక్క మనదేశంలోనే ఉన్నట్టు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే తెలిపారు. ప్రస్తుతం దేశంలో గరిష్ఠంగా 3,925 పులులు ఉండగా సగటున 3,682 ఉన్నట్టు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంటే గత నాలుగేళ్లలో పులుల సంతతిలో 50 శాతం వృద్ధి కనిపించింది.
మధ్యప్రదేశ్లో అత్యధికంగా 785 పులులు ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (563), ఉత్తరాఖండ్ (560), మహారాష్ట్ర (444) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అరుణాచల్ప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్లలో పులుల సంఖ్య కొంత తగ్గింది. దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న పులుల సంతతిని పరిగణనలోకి తీసుకుంటే ఏడాదికి 6.1శాతం వృద్ది కనిపిస్తున్నట్టు అటవీమంత్రిత్వశాఖ పేర్కొం ది. అరుణాచల్ ప్రదేశ్లో 2018లో 29 పులులు ఉండగా, 2022 నాటికి దాదాపు 70శాతం తగ్గిపోయి 9 మాత్రమే మిగిలాయి. అదే కాలంలో ఒడిశాలో 28 నుంచి 20కి పడిపోగా, ఝార్ఖండ్లో ఐదు నుంచి ఒకటికి, ఛత్తీస్గఢ్లో 19 నుంచి 17కి, తెలంగాణలో 26 నుంచి 21కి తగ్గాయి.