న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. నాణ్యమైన విద్య, ఎక్కువ జీతం కోసం భారతీయ విద్యార్థులు చలో అమెరికా అంటున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థుల సంఖ్యలో 35 శాతం పెరుగుదల నమోదైంది. భారత్తో పోలిస్తే చదువులకు అయ్యే ఖర్చు కాస్త ఎక్కువైనా.. అమెరికాలో మంచి ఉద్యోగం దొరికితే జీవితంలో చక్కగా స్థిరపడొచ్చని ఇండియన్ యూత్ భావిస్తున్నది.
మరో ఆసక్తికర పరిణామం ఏమంటే.. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదివే భారత మధ్య తరగతి విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతున్నది. అసోసియేటెడ్ ప్రెస్ అంచనాల ప్రకారం ప్రస్తుతం అమెరికాలో 2.69 లక్షల మంది భారతీయలు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. భారత్లోని టైర్ 2, 3 నగరాల విద్యార్థులు కూడా అమెరికా చదువులపై ఆసక్తి చూపిస్తున్నారు. భారత విద్యార్థులు ట్యూషన్ ఫీజులు పూర్తిగా చెల్లిస్తుండటం వల్ల అమెరికా యూనివర్సిటీల ఆదాయం బాగానే పెరుగుతున్నది.
భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల కన్నా అమెరికాలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో సీటు సంపాదించడం భారతీయ విద్యార్థులకు కొంత సులువుగా మారింది. దరఖాస్తు చేసినవారిలో కేవలం 0.2 శాతం మందికి మాత్రమే భారత్లోని ప్రతిష్ఠాత్మక సంస్థలు ప్రవేశాలు కల్పిస్తుండగా అగ్ర రాజ్యంలోని హార్వర్డ్ యూనివర్సిటీలో అది 3 శాతంగా, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 4 శాతంగా ఉంది. చాలా మంది భారత విద్యార్థులు అమెరికాలో సైన్స్, గణితం, ఇంజినీరింగ్ కోర్సులో చేరుతున్నారు. ఈ రంగాల్లో నిపుణుల కొరత ఉండటంతో అక్కడే తమకు ఉద్యోగం లభిస్తుందని వారు భావిస్తున్నారు. చదువు పూర్తయ్యాక మూడేండ్ల పాటు అమెరికాలో పనిచేసే అవకాశాన్ని అక్కడి ప్రభుత్వం కల్పిస్తుండటం విదేశీ విద్యార్థులకు వరంగా మారింది. వీసా పక్రియను కూడా బైడెన్ సర్కారు సులభతరం చేసింది.