బెంగళూరు: అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే రెండు దఫాల సమావేశాలు ముగించుకుని, మూడో దఫా సమావేశం కావాలని నిర్ణయించుకున్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో మూడో దఫా సమావేశం నిర్వహించుకోవాలని డిసైడ్ అయ్యాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మీడియాకు వెల్లడించారు.
ప్రతిపక్ష పార్టీల మూడో దఫా సమావేశం ముంబైలో జరుగుతుందని, అయితే ఏ తేదీలో సమావేశం జరుగుందనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఖర్గే చెప్పారు. కాగా, బెంగళూరులో జరిగిన రెండో దఫా సమావేశాల్లో ప్రతిపక్షాలు ‘యునైడెట్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ (UPA)’ కు బదులుగా తమ కూటమికి ‘ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూసివ్ అలయెన్స్ (INDIA)’ అని కొత్త పేరు పెట్టకున్నాయి.
అంతేగాక, కూటమి వ్యవహారాలను చక్కదిద్దేందుకు 11 మంది సభ్యులతో కూడిన కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని కూడా బెంగళూరు సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించినట్లు ఖర్గే తెలిపారు. ముంబైలో జరిగే మూడో దఫా సమావేశాల్లో ఆ 11 మంది సభ్యుల పేర్లను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. కాగా, ప్రతిపక్ష పార్టీలు రెండో దఫాలో భాగంగా బెంగళూరులో వరుసగా రెండు రోజులు (జూలై 17, 18) సమావేశమయ్యాయి.
మొదటి దఫా సమావేశాలు జూన్ 23న బీహార్ రాజధాని పట్నాలో ఒకేరోజు ముగిశాయి. ఆ సమావేశానికి దాదాపు 20 పార్టీలు హాజరుకాగా, బెంగళూరులో జరిగిన రెండో దఫా సమావేశాల నాటికి ఆ సంఖ్య 26కు చేరింది. మొదటి సమావేశాల్లో అధికార బీజేపీని ఓడించేందుకు ఏం చేద్దామనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరగ్గా, రెండో దఫా సమావేశాల్లో కూటమికి కొత్తపేరు, కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు, మూడో దఫా సమావేశాలు వంటి నిర్ణయాలు తీసుకున్నారు.