న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర దర్యాప్తు సంస్థను(సీబీఐని) ఉసిగొల్పుతున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ సర్కారు.. సుప్రీంకోర్టు ముందు కీలక వాదనలు చేసింది. సీబీఐ స్వతంత్ర సంస్థ అని, దానిపై కేంద్రానికి ఎలాంటి నియంత్రణ లేదని చెప్పుకొచ్చింది. రాష్ట్రం అనుమతి లేకుండానే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేపడతున్నదని, ఇది రాష్ట్ర హక్కులను హరించడమేనని ఆరోపిస్తూ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించాలని కోరింది.
రాష్ట్రంలో దర్యాప్తు, దాడులు చేపట్టడానికి సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని 2018 నవంబర్ 16న బెంగాల్ ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. అయినప్పటికీ సీబీఐ కేసులు నమోదు చేస్తున్నదని ఆరోపిస్తూ మమత సర్కారు ఆర్టికల్ 131కింద కేంద్రంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్రంతో కానీ, ఇతర రాష్ర్టాలతో కానీ వివాదం తలెత్తినప్పుడు ఆర్టికల్ 131 ప్రకారం ఏదైనా రాష్ట్రం నేరుగా సుప్రీంకోర్టులో కేసు వేయొచ్చు.
బెంగాల్ ప్రభుత్వం తరఫున న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం సీబీఐకి అనుమతి నిరాకరించిన తర్వాత ఎలాంటి దర్యాప్తు చేసే హక్కు దానికి లేదని అన్నారు. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ బెంగాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ యోగ్యం కాదన్నారు. ఆర్టికల్ 131 కింద సీబీఐపై కేసు దాఖలు చేయలేరు అని వాదించారు. ఈ ఆర్టికల్ రాష్ర్టాలు, కేంద్రం లేదా రాష్ర్టాలు, రాష్ర్టాల మధ్య వివాదాలకు సంబంధించినదన్నారు. సీబీఐ కేంద్రం పరిధిలోకి రాదన్నారు.