న్యూఢిల్లీ, డిసెంబర్ 6: కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రాష్ర్టాలకు నిధుల నిలిపివేత, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర సమస్యలపై పార్లమెంట్లో చర్చించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. బుధవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి దాదాపు 30కిపైగా పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఈడీ, సీబీఐ, ఐటీలాంటి సంస్థలను దుర్వినియోగం చేయడంపై చర్చించాలని పట్టుపట్టారు.
తృణమూల్ కాంగ్రెస్ నేతలు కూడా ఇదే డిమాండ్ చేశారు. భారత్-చైనా సరిహద్దులో ఏం జరుగుతున్నదో కేంద్రం చెప్పడం లేదని, దీనిపైనా చర్చించాల్సిందేనని అఖిలపక్ష సభ్యులు సూచించారు. ఒక్కరోజులో ఎన్నికల కమిషన్ను ఎలా నియమించారో అన్న విషయం కూడా చర్చకు రావాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో కేంద్రమంత్రులు రాజ్నాథ్, ప్రహ్లాద్జోషి స్పందిస్తూ పార్లమెంట్ నియమ నిబంధనల ప్రకారం నడుచుకుంటామన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 23 రోజులపాటు కొనసాగి ఈ నెల 29న ముగియనున్నాయి.
మళ్లీ తెరపైకి మహిళా రిజర్వేషన్ బిల్లు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేశాయి. గతంలో వ్యతిరేకించిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపడం గమనార్హం.