బెంగళూరు, మే 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘జగదీశ్ శెట్టర్ ఎట్టిపరిస్థితుల్లో గెలవలేడు’ అంటూ మాజీ సీఎం యెడియూరప్ప చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. దీనిని తమ అస్తిత్వానికి సవాల్గా లింగాయత్ మఠాలు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో లింగాయత్ల ఓట్లు అక్కర్లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ అన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మూరు సావిర, రుద్రాక్షి, నవలగొంద, రాయనాల్ మఠాల అధిపతులు సమావేశం కావడం బీజేపీ వర్గాల్లో టెన్షన్ పుట్టించింది.
హత్యాయత్నం కేసులో నిందితుడి తరఫున మోదీ ప్రచారం
హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివాజినగర బీజేపీ అభ్యర్థి ఎస్ చంద్ర తరఫున ప్రధాని మోదీ ఆదివారం ప్రచారం నిర్వహించటం విమర్శలకు దారితీసింది. 2001లో గనుల అక్రమ తవ్వకాల తనిఖీకి నియమించిన ప్రత్యేక కార్యాచరణ బృందం అధిపతి, అటవీ శాఖ ఉన్నతాధికారి డాక్టర్ యూవీ సింగ్ హత్యకు ప్రయత్నించారనే ఆరోపణపై చంద్రకు వ్యతిరేకంగా కేసు దాఖలైంది.
కర్ణాటకలో ఐటీ శాఖ దాడులు
బెంగళూరు: కర్ణాటకలో ఆదాయపు పన్ను శాఖ రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నది. వివిధ ప్రాంతాల్లో ఐటీ జరిపిన దాడుల్లో రూ.15.3 కోట్ల నగదు, 7.08 కోట్ల విలువైన 10.14 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ప్రధాన ఎన్నికల అధికారి శనివారం తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక ఇప్పటివరకు రూ.365 కోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.