Reservation | న్యూఢిల్లీ, డిసెంబర్ 29: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించింది. 2016, జూన్ 30వ తేదీ నుంచి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది. ‘కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగుల్లో వారి అర్హతలను బట్టి కనీసం గ్రూప్-ఏ స్థాయి వరకు నోషనల్ విధానంలో ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇది 2016, జూన్ 30 నుంచి అమలవుతుంది’ అని అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యదర్శులకు ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల్లో పేర్కొన్నది. అయితే ప్రమోషన్లకు సంబంధించి ఆర్థిక ప్రయోజనాలు సదరు ఉద్యోగి ప్రమోషన్ పోస్టులో చేరిన రోజు నుంచి అమలవుతాయని తెలిపింది. అంటే నోషనల్ ప్రమోషన్ పొందిన తేదీ నుంచి నిజంగా ప్రమోషన్తో కొత్త పోస్టులో చేరేవరకు మధ్య గల కాలానికి సంబంధించి ఉద్యోగికి ఎలాంటి ప్రయోజనాలు అందవు. వివరంగా చెప్పాలంటే.. ఒక ఉద్యోగి 2016 జూన్ 30 నాటికే ప్రమోషన్లలో రిజర్వేషకు అర్హత కలిగి ఉంటే.. అప్పటి నుంచే అతనికి ప్రమోషన్ వచ్చినట్టు లెక్కగడతారు. కానీ, ప్రభుత్వం 2024 జనవరి 1న అతనికి ప్రమోషన్ ద్వారా కొత్త పోస్టు కేటాయించిందని అనుకొందాం. అతడు ఆ రోజే కొత్త పోస్టులో చార్జ్ తీసుకొంటే.. ఆ 2024 జనవరి 1 నుంచి మాత్రమే ప్రమోషన్కు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి.