లక్నో, నవంబర్ 20: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు 3 రోజులపాటు మహాధర్నా (మహాపడావ్) నిర్వహించనున్నాయి. లక్నోలోని ప్రతిష్ఠాత్మక ఎకో గార్డెన్ వద్ద ఈ నెల 26 నుంచి 28 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నాయి. 10 కేంద్ర కార్మిక సంఘాలతోపాటు పలు ఇతర సమాఖ్యలతో కూడిన ఐక్య వేదిక ఈ మహాధర్నాకు పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమ సన్నాహాలపై సమీక్షించేందుకు లక్నోలో సమావేశాన్ని నిర్వహించినట్టు కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఓ ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర వ్యవసాయ చట్టాలపై నిరసనలకు సారథ్యం వహించిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ), అఖిల భారత అంగన్వాడీలు, హెల్పర్ల సమాఖ్య (ఏఐఎఫ్ఏడబ్ల్యూహెచ్)తోపాటు పలు ప్రముఖ కార్మిక సమాఖ్యలు ఈ మహాధర్నాకు మద్దతు ప్రకటించాయి.
కార్మికులకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు చట్టాలను రద్దు చేయడంతోపాటు సంఘటిత కార్మికుల నెలవారీ కనీస వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయించాలని, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) స్థానంలో కొత్త పంటల బీమా, పరిహార పథకాన్ని ప్రవేశపెట్టాలని, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ ఉపకరణాలను మినహాయించాలన్న ప్రధాన డిమాండ్లతో ఈ మహాధర్నాను నిర్వహించనున్నట్టు కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక తెలిపింది.