(స్పెషల్ టాస్క్ బ్యూరో)
The Kerala Story | హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు నాలుగు రోజుల ముందు మే 5న విడుదల కాబోతున్న చిత్రం ‘ది కేరళ స్టోరీ’ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. దక్షిణాదిలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందే దుష్ట పన్నాగంతోనే సంఘ్ పరివార్ శక్తులు ఈ చిత్రాన్ని నిర్మించారని కేరళ అధికార పార్టీ సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమా ప్రదర్శనను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి.
హిజాబ్, లవ్ జిహాద్ ఇతివృత్తంతో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ కథను కేరళ సీఎం పినరాయి విజయన్ ఖండించడంతో ఈ చిత్రం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం ట్రైలర్ చూస్తే సంఘ్ పరివార్ సిద్ధాంతాలను హైలెట్ చేస్తున్నదని, లవ్జిహాద్ పేరిట మతపరమైన విద్వేషాలను వ్యాప్తి చేస్తూ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు ఉన్నదని విజయన్ ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు.
కేరళలో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో సంఘ్ పరివార్ శక్తులు ఇలాంటి దుష్ప్రచారం చేసే చిత్రాలు నిర్మిస్తున్నారని మండిపడ్డారు. మతపరమైన విషపు విత్తనాలతో కేరళలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ సినిమా మున్ముందు మరింత వివాదాస్పదంగా మారే అవకాశం ఉన్నదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దక్షిణాది రాష్ర్టాల్లో పాగా వేసే లక్ష్యంతో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ తన ఓటు బ్యాంక్ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నదని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికలను కూడా ఈ సినిమా ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు చెప్తున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో హిందువుల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టడానికి ‘కశ్మీర్ ఫైల్స్’, ‘ ది కేరళ స్టోరీ’ వంటి సున్నితమైన కథాంశాలతో ఇలాంటి సినిమాల నిర్మాణాన్ని బీజేపీ తెరవెనుక ఉండి ప్రోత్సహిస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సినిమా మాధ్యమాన్ని కూడా బీజేపీ తన రాజకీయ లబ్ధికి ఎన్నికల ప్రచార అస్త్రంగా మలుచుకుంటున్నదని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. గత ఏడాది ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాను ప్రధాని మోదీ ఏ విధంగా ప్రమోట్ చేసారో పలువురు నేతలు గుర్తుచేస్తున్నారు.
‘ది కేరళ స్టోరీ’ సినిమా టీజర్, అందులోని డైలాగ్లు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఈ సినిమా విడుదలను నిషేధించాలని అందిన ఫిర్యాదులపై సీఎం విజయన్ స్పందించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని ఆ రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. తిరువనంతపురం పోలీస్ కమిషనర్ అనిల్కాంత్ ఈ సినిమాపై దర్యాప్తు జరుపుతున్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాతనే సినిమా విడుదలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం విజయన్ పేర్కొన్నారు. కేరళలో ఉన్న మతసామరస్య వాతావరణాన్ని చెడగొట్టే లక్ష్యంతోనే సంఘ్ పరివార్ ఇలాంటి సినిమా రూపొందిచినట్టు కనిపిస్తున్నదని మంత్రి సాజి చెరియన్ కొల్లం ఆరోపించారు. మైనారిటీ వర్గాలపై అనుమానాలను కలుగజేసి సమాజంలో మతోన్మాదాన్ని, విభజనను తీసుకొచ్చే ఎజెండాతో ‘ది కేరళ స్టోరీ’ తీశారని ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్ ఆరోపించారు.