న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ ముగిసింది. న్యాయస్థానం సోమవారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోరిన విషయం తెల్సిందే. దీనిపై గురువారం వాదనలు జరిగాయి. ఈడీ కస్టడీ ముగిసినందున రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాదులు మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
కవిత తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ బెయిల్కు సంబంధించిన తీర్పును ప్రస్తావించారు. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వవచ్చని, న్యాయస్థానం ఏ షరతులు పెట్టినా.. వాటిని అమలు చేసేందుకు కవిత సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తల్లిగా తన కుమారుడికి పరీక్షలు ఉన్నపుడు దగ్గర ఉండటం కవితకు అత్యవసరమని, పరీక్షల సందర్భంగా తల్లిగా నైతిక మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. పరీక్షలు, విద్యార్థుల సన్నద్ధత గురించి ప్రధాని మోదీ కూడా అనేక సందర్భాల్లో చెప్పారని, తల్లి మద్దతు పిల్లలకు ఉండాలని అన్నారు.
తల్లి అరెస్టు కవిత కుమారుడిపై పడే ప్రమాదం ఉన్నదని, పరీక్షలు వంటి కీలక సమయంలో తల్లి సపోర్టు బిడ్డకు అవసరమని చెప్పారు. కవిత భర్త న్యాయపోరాటంలో ఉన్నారని, ఆయన తన కుమారుడిపై పూర్తిగా దృష్టిసారించలేకపోతున్నారని అన్నారు. మహిళగా, తల్లిగా కవితకు బెయిల్ ఇవ్వవచ్చని చెప్పారు. ఏప్రిల్ 16 వరకు కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని తెలుపుతూ పరీక్షల షెడ్యూల్ వివరాలను కోర్టుకు అందజేశారు.
కవిత అరెస్టుతో కుమారుడు కుంగుబాటుకు గురవుతున్నాడని, ఆ బాలుడు పరీక్షలకు గైర్హాజరయ్యే ప్రమాదం ఉన్నదని చెప్పారు. తల్లి పాత్రను తండ్రి పూర్తిగా భర్తీ చేయలేరన్నారు. గతంలో న్యాయస్థానాలు వివిధ సందర్భాల్లో మహిళలకు బెయిల్ ఇచ్చిన సందర్భాలను ఈ సందర్భంగా కోర్టు ముందుంచారు. ప్రీతి చందా, సౌమ్యచౌరాసియా తదితర కేసుల గురించి వివరించారు. ఆయా కేసుల్లో న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చాయని చెప్పారు. కల్వకుంట్ల కవితకు కూడా షరతులతో కూడిన బెయిల్ ఇవ్వాలని కోరారు.
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి గతంలోనే తాము దినేశ్ అరోరాను అదుపులోకి తీసుకున్నామని, ఆయన ఈ కేసులో అప్రూవర్గా మారారని ఈడీ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది. ఈడీ తరఫున జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తూ.. అప్రూవర్గా మారిన తర్వాత దినేశ్ అరోరా అనేక విషయాలు చెప్పారని, రూ.100 కోట్లు కవిత ఆలోచనల మేరకే ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపుల రూపంలో ఇచ్చారని తెలిపారు. ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్డాటాను కూడా రికవరీ చేశామని, ఆ డాటా ప్రకారం కవితను విచారించామని చెప్పారు.
ఈ కేసులోనే ప్రధాన పాత్రపోషించిన అరుణ్పిైళ్లెతో కలిపి కవితను విచారించామని తెలిపారు. ఈ సమయంలో కవితకు బెయిల్ ఇవ్వవద్దని వాదించారు. బెయిల్ ఇస్తే కవితపై దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని అన్నారు. ఆమెకు బెయిల్ ఇస్తే ఆధారాలను ధ్వంసం చేస్తారని, సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మధ్యంతర బెయిల్కు సంబంధించిన తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. రెగ్యులర్ బెయిల్కు సంబంధించి కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఈనెల 20న వాదనలు కొనసాగనున్నాయి.