అహ్మదాబాద్ : పోలీస్ హెల్ప్లైన్ కోసం అధికారులు ప్రచారం చేసిన తీరుపై గుజరాత్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్ లాంటి ఉన్నతాధికారులు తామేదో దేవుళ్లలా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని విమర్శించింది.
ప్రజల ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ గురించి, దాని హెల్ప్లైన్ గురించి సామన్యులకు అర్ధమయ్యేలా స్పష్టంగా తెలియజేయాలని చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ అనిరుద్ధ పి మయీలతో కూడిన ధర్మాసనం పోలీస్ శాఖను ఆదేశించింది. పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించడం సామాన్యుడికి అంత సులభం కాదని, కమిషనర్ కార్యాలయం అందని స్థాయిలో ఉన్నదని సీజే వ్యాఖ్యానించారు. అన్యాయాన్ని ఎవరికి ఫిర్యాదు చేయాలో పౌరులకు తెలియడం లేదని అన్నారు.